‘ఆర్బిట్రేషన్’తో వివాదాల సత్వర పరిష్కారం
ABN, First Publish Date - 2022-09-17T09:15:08+05:30
అంతర్జాతీయంగా విదేశీ పెట్టుబడులు విస్తృతమవుతున్న నేపథ్యంలో ఆర్బిట్రేషన్ సెంటర్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వివాదాలను సత్వరమే....
సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యాఖ్య
శామీర్పేట, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయంగా విదేశీ పెట్టుబడులు విస్తృతమవుతున్న నేపథ్యంలో ఆర్బిట్రేషన్ సెంటర్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వివాదాలను సత్వరమే పరిష్కరించుకోవచ్చని నల్సార్ యూనివర్సిటీ ఛాన్సలర్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. శామీర్పేటలోని నల్సార్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్రెడ్డి పేరున ఏర్పాటయిన అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ పరిశోధన కేంద్రాన్ని(జేఆర్సీఐటీబీఎల్) శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రం ఏర్పాటు చేయడానికి జస్టిస్ జీవన్రెడ్డి మార్చిలో రూ.1.5 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా జస్టిస్ భుయాన్ మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయ అంశాలు, చట్టాలపై లోతైన అవగాహన, శిక్షణ అవసరమని భావించి ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇన్ఛార్జ్జి వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ నల్సార్లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ స్థాయిలో కోర్సులను ప్రారంభించి బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ న్యాయ పరిశోధన కార్యాలయ నూతన వైబ్సైట్ను జస్టిస్ బీపీ జీవన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
Updated Date - 2022-09-17T09:15:08+05:30 IST