పోలీసు శాఖపై సమీక్ష చేయండి
ABN, First Publish Date - 2022-01-26T09:34:34+05:30
టీఆర్ఎస్ నేతలు పోలీసులను పనిచేయనివ్వట్లేదంటూ గవర్నర్ తమిళిసైకు సీఎల్పీ బృందం ఫిర్యాదు చేసింది.
- రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి
- గవర్నర్ తమిళిసైకి సీఎల్పీ బృందం ఫిర్యాదు
హైదరాబాద్, కొత్తగూడెం కలెక్టరేట్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ నేతలు పోలీసులను పనిచేయనివ్వట్లేదంటూ గవర్నర్ తమిళిసైకు సీఎల్పీ బృందం ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, పోలీసుల నుంచి రక్షణ దొరుకుతుందన్న భావనను ప్రజలు కోల్పోయారని గవర్నర్ దృష్టికి తెచ్చింది. పోలీసు శాఖపై సమీక్ష చేయాల్సిందిగా కోరింది. మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, సీతక్కలు కలిశారు. ఈ సందర్భంగా వనమా రాఘవ వేధింపులతో పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, పెద్దపల్లి జిల్లాలో వామనరావు దంపతులు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య, దిశ.. హాజీపూర్ ఘటనలు, మరియమ్మ లాకప్ డెత్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు చెప్తేనే పోలీస్ దగ్గర న్యాయం జరుగుతుందని అన్నారు.
317 జీవోపై గవర్నర్కు బీజేపీ, టీటీడీపీ వినతి
జీవో 317ను తక్షణం సవరించేలా లేదా ఉపసంహరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్కు బీజేపీ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు నేతృత్వంలోని బృందం గవర్నర్ను కలుసుకుని వినతిపత్రం అందజేసింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్న జీవో 317ను సవరించేలా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని టీడీపీ-టీఎస్.. రాష్ట్ర గవర్నర్ తమిళిసైను కోరింది. పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి నేతృత్వంలో నేతలు మంగళవారం గవర్నర్కు వినతిపత్రం ఇచ్చారు.
Updated Date - 2022-01-26T09:34:34+05:30 IST