రోడ్ల పక్కన డబ్బాలపై పట్టింపేది?
ABN, First Publish Date - 2022-10-05T05:11:37+05:30
రోడ్ల పక్కన డబ్బాలపై పట్టింపేది?
- ఆర్అండ్బీ రోడ్డు వెంబడి ఎక్కడికక్కడ కబ్జా
- పట్టించుకోని మండల అధికారులు
బషీరాబాద్, అక్టోబరు 4: బషీరాబాద్ మండల కేంద్రంలో అనుమతులు లేకుండా రోడ్ల పక్కన స్థలాల్లో డబ్బాలు వెలుస్తున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్రమంగా కబ్జా చేసి డబ్బాలు వేసుకొని దుకాణాలు నడిపిస్తున్నారు. కొందరు ఖాళీ జాగాను కబ్జాచేసే వ్యూహంలోనే డబ్బాలు ఏర్పాటు చేసి కొన్ని రోజులకు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని పట్టణవాసులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇలా చాలాచోట్ల ఖాళీ స్థలాన్ని కబ్జా చేశారని వాపోతున్నారు. మరి మండల కేంద్రంలోనే ఇలా కబ్జా పర్వానికి పాల్పడుతున్నా అధికారులు మాత్రం అసలే పట్టిం చుకోవడం లేదు. ప్రజావసరాలకు వినియోగించాల్సిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకొని చిన్న పాటి దుకాణాలు నిర్వహించుకుంటున్నారు. దీంతో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాల పార్కింగ్ చేయడంతో పాటు ట్రాఫిక్ జామ్కు, ప్రమాదాలకు కారకం అవుతున్నారు.
- ప్రధాన రోడ్డు వెంట కబ్జాల పర్వం
పట్టణంలో రద్దీగా ఉండే రైల్వేగేటు సమీపంలోని మలుపు వద్ద నుంచి పంచాయతీ కార్యా లయం వరకు ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఉన్న స్థలాల్లో డబ్బాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిపై పంచాయతీ డబ్బాలు పెట్టిన వారికి నోటీసులు జారీ చేసినా లెక్క చేయడం లేదు. మండల అధికారులు పూనుకొని పోలీసుల సహకారంతో వాటిని తొలగిస్తే బాగుంటుందనే అ భిప్రాయం వ్యక్తం అవుతోంది. పశువైద్యశాల కాంపౌండ్ వాల్కు ఇటీవల ఓ వ్యక్తి గోడకట్టి డబ్బా ఏర్పాటు చేశాడు. ఈ పనిని వైద్యాధికారి అడ్డుకోవడంతో పనులను నిలిపివేశారు. ఇలా అన్ని శాఖల అధికారులు పట్టిచుకొని వారి కార్యాలయాల ఆవరణల్లోని ఖాళీ స్థలాలను కాపా డుకోవాల్సి ఉంది. ఆర్అండ్బీ అధికారులు ఆక్రమణలను తీసేయాలని స్థానికులంటున్నారు.
Updated Date - 2022-10-05T05:11:37+05:30 IST