అధికారుల ఆదేశాలు బేఖాతర్
ABN, First Publish Date - 2022-02-20T04:47:12+05:30
అధికారుల ఆదేశాలు బేఖాతర్
కేశంపేట, ఫిబ్రవరి 19: అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ కేశంపేట మండలంలోని మంగళగూడ గ్రామంలో అనుమతులు లేకుండా ఓవ్యక్తి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. మంగళగూడ గ్రామ శివారు సర్వే నెంబర్ 140లో ప్రభుత్వ మిగులుభూమి ఉంది. ఇదే సర్వే నెంబర్లో గ్రామానికి చెందిన మొగుళ్ల అంజయ్య, పర్వతాలు, చెన్నయ్య, ఎల్లయ్యలు 15 గుంటలు అక్రమించి సాగు చేస్తున్న విషయాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు గత నెల 26న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంతో గ్రామానికి చెందిన పవన్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడని గ్రామస్థులు తహసీల్దార్ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ వెంటనే ఇంటి నిర్మాణ పనులను నిలిపివేయించారు. అయితే గొడవ సద్దుమనగడంతో పవన్ అనే వ్యక్తి శనివారం నుంచి తిరిగి పనులు ప్రారంభించాడు. గ్రామస్థులు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని, ప్రభుత్వ భూమిని కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా నిబంధనలు అతిక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - 2022-02-20T04:47:12+05:30 IST