బోల్తా పడిన ఆటోను ఢీకొట్టిన కారు
ABN, First Publish Date - 2022-05-28T05:02:52+05:30
బోల్తా పడిన ఆటోను అతివేగంగా కారు ఢీకొనడంతో
- విద్యార్థితోపాటు ఆటో డ్రైవర్ మృతి.. నలుగురికి గాయాలు
యాచారం, మే 27 : బోల్తా పడిన ఆటోను అతివేగంగా కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన శుక్రవారం యాచారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. యాచారం మండలంలోని నక్కగుట్టతండా సమీపంలోని సోషల్వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వతరగతి చదువుతున్న రోహిత్, అతని బాబాయి కుమారుడు కరుణాకర్, గండిపేటకు చెందిన మల్లికార్జున్, లంగార్హౌజ్కు చెందిన శ్రీహర్ష, ఇబ్రహీంపట్నం మండలం పెద్దతూండ్లకు చెందిన ప్రదీ్పకుమార్లు తమ స్వగ్రామాలకు వెళ్లడానికి ఆటో ఎక్కారు. యాచారం మండల కాంప్లెక్స్ వద్ద ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఇది గమనించని ఎదురుగా వస్తున్న షిఫ్ట్ కారు డ్రైవర్ బోల్తాపడిన ఆటోను బలంగా ఢీ కొట్టాడు. దాంతో సంఘటనా ప్రదేశంలో ఆటోడ్రైవర్ శేఖర్(38) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన లంగార్హౌజ్కు చెందిన రోహిత్(15)ను 108 అంబులెన్స్లో ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. రోహిత్ బాబాయి కుమారుడు కరుణాకర్కు కాలు విరిగింది. ఈ ప్రమాదంలో శ్రీహర్ష, ప్రదీ్పకుమార్, మల్లికార్జున్ గాయపడ్డారు. వారికి యాచారం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసి ఇళ్లకు తరలించారు.
వీధిన పడిన ఆటో డ్రైవర్ కుటుంబం
నల్లవెల్లికి చెందిన శేఖర్ నిత్యం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య సుమతి, కుమారులు సంపత్, సుశాంత్ ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు మృతిచెందడంతో శేఖర్ కుటుంబం వీధినపడింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై వెంకటనారాయణ చెప్పారు.
Updated Date - 2022-05-28T05:02:52+05:30 IST