కృష్ణాజలాల గెజిట్ను రద్దుచేయాలి
ABN, First Publish Date - 2022-05-16T05:32:57+05:30
కృష్ణాజలాల గెజిట్ను రద్దుచేయాలి
- వ్యవసాయాన్ని బాగు చేద్దామని ఎవరికీ లేదు!
- అందరికీ రియల్ఎస్టేట్ మీదనే ధ్యాస..
- ప్రొఫెసర్ కోదండరాం
వికారాబాద్ జిల్లా, మే 15 : కృష్ణానది జలాల సంరక్షణకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన గెజిట్ను తక్షణమే రద్దు చేయాలని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం బాగు చేద్దామని ఎవరికీ లేదని, ప్రతిఒక్కరికీ రియల్ ఎస్టేట్ మీదనే ధ్యాస ఉందని, పశ్చిమ తెలంగాణకు నీటి విషయంలో పూర్తిగా అన్యాయం జరుగు తోందని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా అనంతగిరి హరిత రిసార్ట్స్లో తెలంగాణ నీటిజలాల సంరక్షణపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ కృష్ణానది నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, అయినా మన వాటా మనకు దక్కడం లేదన్నారు. జూరాల నుంచి నీటిని ఎత్తిపోయాలని అనుకుని.. అప్పటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారన్నారు. జూరాల నుంచి శ్రీశైలం వరకు తీసుకెళ్లడంతో అది వెనక్కి వెళ్లిందన్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్తో రాష్ట్రంలోని నదీ జలాలు మొత్తం కేంద్రం ఆధీనంలోకి వెళ్లాయన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నీటిని కేంద్రం సరైన రీతిలో పంచడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రాన్ని అడగటం లేదన్నారు. కృష్ణానదీ జలాలను వాడుకునే శక్తి రాష్ట్రానికి లేదని కేంద్రం అంటోందని, ఏడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అది చేయలేక పోయిందన్నారు. అప్పట్లో బొంరాస్పేట నుంచి శ్రీశైలం వరకు నీటి విషయమై పాదయాత్ర నిర్వహించామని, అప్పుడు రైతులు సైతం జూరాల నుంచి నీటిని ఎత్తిపోయాలని కోరారని కోదండరాం గుర్తుచేశారు. గోదావరి నీటిని హైదరాబాద్కు తీసుకొస్తే.. మంజీరా నీటిపై వికారాబాద్కు కూడా హక్కు ఉంటుందన్నారు. గోదావరి నీటి కోసం శంకర్పల్లి వద్ద కూడా అప్పట్లో పనులు చేశారన్నారు. మంజీరా నీటిని ఇక్కడికి తేగలిగితే వికారాబాద్, శంకర్పల్లి ప్రాంతాలకు తాగునీటి సమస్య ఉండదన్నారు. ప్రభుత్వం హైదరాబాద్ జంట జలాశయాల నీరు.. హైదరాబాద్కు అవసరం లేదంటోందని, కానీ ఆ నీటిపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అవసరం ఉందని, ఆ నీటిని ఎలా వాడుకోవాలో మనం నిర్ణయించుకుందామన్నారు. సాగునీటి అంశంపై ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్షల కోట్లు ఖర్చు చేశారని, అందులో 30 శాతం డబ్బులు ఖర్చుచేసినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకుని తిరిగామని, ఇప్పుడు ఈ సమస్యను పట్టుకుని తిరగాలన్నారు. జల రాజకీయాలను లేవనెత్తి, దానికోసం మరోసారి ప్రచారం చేయాలన్నారు. ఢిల్లీకి, గల్లీకి పట్టింపులేదని.. జలాశయాలను తమ కంట్రోల్లో పెట్టుకుంటామని కేంద్రం.. మేము ఆ విషయం అడగమని అన్నట్లు రాష్ట్రం వ్యవహరిస్తోందన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కేంద్రం సమస్యను సృష్టిస్తోందే తప్పా.. పరిష్కరించడం లేదని కోదండరాం అన్నారు. గతేడాది జూలైలో కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వస్తే.. ఇంతవరకూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రజాచైతన్య కార్యక్రమాలను చేపట్టలేదని అన్నారు. గెజిట్ కారణంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. మన సమస్య కోసం.. మనమే కదలాల్సిన సమయం అసన్నమైందన్నారు. గోదావరి, కృష్ణా జలాలు మన ప్రాంతాలకు రావాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ ఇండియా చైర్మన్ రణదీర్ బుద్ధ, అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్రెడ్డి, సీనియర్ పాత్రికేయుడు రాంచంద్రమూర్తి, మాజీ ఓఎస్డీ రంగారెడ్డి, టీడీఎఫ్ సలహాదారు డీపీరెడ్డి, హైకోర్టు న్యాయవాది దివ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, నాయకులు మల్లేశం, మహిపాల్, ఆవుటి రాజశేఖర్, అనంతయ్య, రాంచందర్, లక్ష్మీనారాయణ, సామల కృష్ణారెడ్డి, మకుంద నాగేశ్వర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-05-16T05:32:57+05:30 IST