మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
ABN, First Publish Date - 2022-05-29T05:38:55+05:30
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
యాచారం, మే 28: మండల కేంద్రంలో ఆటో-కారు ఢీకొన్న ప్రమాదంపై ఆర్ అండ్ బీ అధికారులు బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు తక్షణమే ఆర్థికసాయం అందజేయాలని బీజేపీ నాయకులు మండల కేంద్రంలో శుక్రవారం బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కిసాన్మోర్చా కార్యవర్గ సభ్యులు పాపయ్యగౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవి, ప్రధాన కార్యదర్శి నడికూడి కృష్ణలు మాట్లాడుతూ.. కేవలం ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యంతోనే 9వ తరగతి చదువుతున్న రోహిత్, ఆటో డ్రైవర్ శేఖర్ మృతిచెందినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రహదారి పాడై ఏడాది అవుతున్నా ఎందుకు బాగు చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డును రెండు రోజుల్లో బాగుచేయకపోతే మండల కేంద్రంలో పెద్దఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బీజేపీ కిసాన్మోర్చా మాజీ కార్యవర్గ సభ్యులు బోజిరెడ్డి, నాయకులు పి.శ్రీశైలం, గణేష్, రవీందర్, వెంకటేష్, శ్రీనాథ్, శ్రీధర్గౌడ్ పాల్గొన్నారు.
రెండు రోజుల్లో రహదారిని బాగు చేస్తాం
మండల కేంద్రంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని శుక్రవారం ఆర్అండ్బీ డీఈ వేణుగోపాల్రెడ్డి, ఇన్స్పెక్టర్ లింగయ్య, ఆర్అండ్బీ ఏఈ శ్రీహరి, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీపీ కొప్పు సుకన్యబాషాలు సందర్శించారు. రోడ్డు బాగు లేకపోవడంతో ప్రమాదం జరిగిందని ఎంపీపీ ఆర్అండ్బీ అధికారుల దృష్టికి తెచ్చారు. కాగా రెండు రోజుల వ్యవధిలో రహదారిని బాగు చేయనున్నట్లు ఆర్అండ్బీ డీఈ వేణుగోపాల్ పేర్కొన్నారు.
Updated Date - 2022-05-29T05:38:55+05:30 IST