దారి చూపాలంటూ గొర్రెలు, మేకలతో తహసీల్దార్ కార్యాలయ ముట్టడి
ABN, First Publish Date - 2022-09-09T05:06:33+05:30
తమ వ్యవసాయ పొలాలకు దారి చూపాలంటూ గొర్రెలకాపరులు
కేశంపేట, సెప్టెంబరు 8 : తమ వ్యవసాయ పొలాలకు దారి చూపాలంటూ గొర్రెలకాపరులు వినూత్న నిరసన చేపట్టారు. మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గొర్రెలు, మేకలతో ఆందోళన చేపట్టిన సంఘటన గురువారం కేశంపేటలో చోటు చేసుకుంది. మండల కేంద్రం నుంచి రావిచేడు వెళ్లే దారికి రెవెన్యూ మ్యాప్లో నక్షబాట ఉంది. అయితే ఆ దారిలోనే ముస్లింలకు చెందిన ఖబ్రస్తాన్ ఉండటంతో దాని చుట్టూ ముస్లింలు ప్రహరీ నిర్మిస్తున్నారు. దీంతో రావిచేడుకు వెళ్లే నక్షబాట కబ్జాకు గురై ప్రహరీ లోపలికి వెళ్తుంది. తమ గ్రామానికి వెళ్లేందుకు బాట చూపాలని గొర్రెల కాపరులు, వ్యవసాయ రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. రావిచేడు దారి మార్గం సమస్యపై మండల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం గ్రామస్థులతో సమావేశమైంది. ఖబ్రాస్తాన్ మీదుగా దారి వదిలేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మురళీకృష్ణ, కేశంపేట సర్పంచ్ తలసాని వెంకట్రెడ్డి, కేశంపేట ఎస్సై ధనుంజయ్ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
Updated Date - 2022-09-09T05:06:33+05:30 IST