రంగారెడ్డి డీసీసీకి కొత్త సారథి?
ABN, First Publish Date - 2022-12-11T00:41:07+05:30
రాష్ట్ర కాంగ్రె్సలో కీలక మార్పులకు పార్టీ కేంద్ర అధిష్టానం ప్రక్షాళన చేపట్టింది. అన్ని సమీకరణాలను పరిగణంలోకి తీసుకుంటూ, సీనియర్లకు ప్రాధాన్యమిస్తూ యువ నాయకత్వం, ఏళ్లుగా పార్టీకి విదేయులకు పదవుల్లో సముచిత స్థానం కల్పించారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ కూర్పుపై హైకమాండ్ తర్జనభర్జన
కొత్త సారథి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్
పెండింగ్లో రంగారెడ్డి డీసీసీ చీఫ్ నియామకం
మేడ్చల్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుల కొనసాగింపు
పీసీసీ పదవుల్లో వికారాబాద్ జిల్లాకు పెద్దపీట
కార్యనిర్వాహక కమిటీలో మాజీ మంత్రి ప్రసాద్కుమార్కు చోటు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ధారాసింగ్, రఘువీరారెడ్డి
రంగారెడ్డి అర్బన్/షాద్నగర్ అర్బన్/వికారాబాద్, మేడ్చల్(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): డిసెంబరు 10: రాష్ట్ర కాంగ్రె్సలో కీలక మార్పులకు పార్టీ కేంద్ర అధిష్టానం ప్రక్షాళన చేపట్టింది. అన్ని సమీకరణాలను పరిగణంలోకి తీసుకుంటూ, సీనియర్లకు ప్రాధాన్యమిస్తూ యువ నాయకత్వం, ఏళ్లుగా పార్టీకి విదేయులకు పదవుల్లో సముచిత స్థానం కల్పించారు. పార్టీ పదవుల్లో ఉన్నా క్షేత్రస్థాయిలో చురుగ్గా లేనివారికి రిక్తహస్తం చూపారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీల్లో పలు మార్పులు, చేర్పుల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ కమిటీలను శనివారం ప్రకటించింది. రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎం.రమే్షమహరాజును పోస్టు నుంచి తప్పించిన అధిష్టానం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దేముల్ జడ్పీటీసీ ధారాసింగ్ను నియమించింది. పీసీసీ రాష్ట్ర నూతన కమిటీలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి కీలకంగా వ్యవరించిన నాయకులకు కార్యవర్గంలో చోటుదక్కింది. ఇబ్రహీంపట్నానికి చెందిన చిలుక మధుసూదన్రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఎలుగంటి మధుసూధన్రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన జ్ఞానేశ్వర్ముదిరాజ్, షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన నుంచి వీర్లపల్లి శంకర్, రంగారెడ్డి ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిలకు పీసీసీ రాష్ట్ర నూతన కమిటీల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సారథి ఎవరు?
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంపై ఊగిసలాట కొనసాగుతోంది. డీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ నాయకత్వం ఎటూ తేల్చలేదు. తెలంగాణలోని 26జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. వారిలో ఉమ్మడి రంగారెడి జిల్లా వికారాబాద్ డీసీసీ చీఫ్గా రామ్మోహన్రెడ్డి, మేడ్చల్కు నందికటి శ్రీధర్లను యథావిధిగా కొనసాగించారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడి పేరును మాత్రం ఖరారు చేయలేదు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన మాత్రం తనకు మరోసారి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. రంగారెడ్డి డీసీసీ కోసం ఎక్కువ మంది పోటీపడుతోన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మాజీ మంత్రి పుష్పలీల మహిళా కోటాలో తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మల్రెడ్డి రాంరెడ్డి, చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఎలుగంటి మధుసూధన్రెడ్డి, పల్గుట్ట జనార్దన్రెడ్డి సైతం జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. అలాగే సీనియర్ నాయకులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన భూపతిగళ్ల మహిపాల్, మర్రి నిరంజన్రెడ్డి, శేఖర్గౌడ్, మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన దేప భాస్కర్రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, అమరేందర్రెడ్డి, దండెం రాంరెడ్డి, శంషాబాద్ ప్రాంతానికి చెందిన వేణుగౌడ్ డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఇలా రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి ఎక్కువ మంది పోటీ పడుతుండడంతో ఎవరికివ్వాలో పార్టీ అధిష్టానం తేల్చుకోవడం లేదు.
వికారాబాద్ జిల్లా నాయకులకు పార్టీ పదవులిలా..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో వికారాబాద్ జిల్లాకు పెద్దపీట వేశారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి చైర్మన్గా 40మందితో ఏర్పాటైన పీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్కు చోటు దక్కింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం దక్కింది. పెద్దేముల్ జడ్పీటీసీ ధారాసింగ్, కాంగ్రెస్ ధారూరు మండల అధ్యక్షుడు పి.రఘువీరారెడ్డిలను పీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. సీనియరైన ధారాసింగ్ గతంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, పీసీసీ డెలిగేట్గా పనిచేశారు. తనకు తెలియకుండా పీసీసీ డెలిగేట్గా తప్పించారని రాజీనామా చేశారు. తర్వాత పార్టీ అధిష్టానం బుజ్జగింపుతో రాజీనామా ఉపసంహరించారు. పార్టీకి విధేయుడుగా పనిచేయడంతో పీసీసీ ప్రధానకార్యదర్శి బాధ్యతలు కట్టబెట్టారు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని మరోసారి పరిగి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డికే కట్టబెట్టారు. పార్టీ పదవుల నియామకాలకు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన ఎం.రమేష్ మహరాజ్ను పార్టీ అధిష్ఠానం తప్పించి ఆయన స్థానంలో తాండూరు నియోజకవర్గానికి చెందిన ధారాసింగ్ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇదిలా ఉంటే, జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేకుంటూ రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయ పథాన నడిపించాల్సిన బాధ్యత ఈ కమిటీలపై ఉంది.
మేడ్చల్ జిల్లా నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడిగా వజ్రే్షయాదవ్
మేడ్చల్ జిల్లా బోడుప్పల్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తోటకూర వజ్రే్షయాదవ్ టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. వజ్రే్షయావ్ను ప్రతిపాదిస్తూ పంపిన 24మందితో కూడిన జాబితాకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆమోదముద్ర వేశారు. వజ్రే్షయావ్ ఇంతకు ముందు మేడ్చల్ నియోజకవర్గ పార్టీ కన్వీనర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా వజ్రే్షయాదవ్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేస్తానని పేర్కొన్నారు.
Updated Date - 2022-12-12T22:50:27+05:30 IST