మహేశ్వరానికి మహర్దశ
ABN, First Publish Date - 2022-01-28T03:55:54+05:30
మహేశ్వరానికి త్వరలో మహర్దశ రానుందని..
- మంత్రి సబితాఇంద్రారెడ్డి
మహేశ్వరం, జనవరి 27 : మహేశ్వరానికి త్వరలో మహర్దశ రానుందని.. మండలంలోని అన్ని ప్రధాన రహదారుల విస్తరణ పనులు వేగవంతమవుతున్నాయని.. విప్రో వంటి మరిన్ని భారీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి రానున్నాయని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మండలపరిధిలోని మన్సాన్పల్లి చౌరస్తాలో రూ. కోటి 50లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సీసీరోడ్డు పనులకు ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి గురువారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతోకాలంగా మండలంలోని ప్రధాన రహదారులు విస్తరణకు నోచుకోక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇకనుంచి ప్రధాన రహదారులతోపాటు ప్రతీ గ్రామంలో పక్కా రోడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే మహేశ్వరం, నాగారం, అమీర్పేట, తుక్కుగూడ ప్రధాన రహదారులను విస్తరించినట్లు తెలిపారు. ప్రధాన రహదారుల కూడళ్లలో బీటీ రోడ్డు చెడిపోతున్నందున నాణ్యమైన సీసీరోడ్లు వేయిస్తున్నామన్నారు. అదేవిధంగా మండలంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే అనేక పరిశ్రమలు నెలకొల్పామని, ఇంకా మరిన్ని రాబోతున్నాయన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితాఅంద్యానాయక్, టీఆర్ఎస్ మండలాద్యక్షుడు ఆంగోత్రాజునాయక్, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ, మిషన్ భగీరథ పనుల కోసం నిధులు
తుక్కుగూడ మార్కెట్ యార్డు త్వరలో అధునాతన సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్యార్డు నిర్మాణం, మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 32 కోట్ల 50లక్షలను విడుదల చేసింది. కాగా, జనవరి 29న వీటి పనుల కోసం జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖమంత్రి పి.సబితారెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కాంటేకర్ మధుమోహన్, కౌన్సిలర్లు, అధికారులు గురువారం తుక్కుగూడ మార్కెట్యార్డులో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మధుమోహన్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు ఏర్పాటుకు మంత్రి సబితారెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. అదేవిధంగా ఈ మార్కెట్ నిర్మాణం పూర్తయితే నాన్వెజ్, పండ్లు, కూరగాయలు ఒకేచోట ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
Updated Date - 2022-01-28T03:55:54+05:30 IST