లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
ABN, First Publish Date - 2022-01-25T05:08:03+05:30
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
బంట్వారం(కోట్పల్లి), జనవరి 24: లారీ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన కోట్పల్లి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంట్వారం మ ండలం రొంపల్లికి చెందిన కుర్వ ఎల్లప్ప(21) నెల రోజుల క్రితం పల్సర్ బైక్ ను కొన్నాడు. దానికి రిజిస్ట్రేషన్ కోసం తండ్రి మహిపాల్తో కలిసి వికారాబాద్ వచ్చి పనులు ముగించుకుని కోట్పల్లి వెళ్లారు. తన తండ్రిని గ్రామానికి చెందిన మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లమని చెప్పి తాను రాంపూర్ వద్ద జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ చూసేందుకు వెళ్లాడు. టోర్ని ముగిసిన తర్వాత తన బైక్పై వస్తుండగా అన్నసాగర్ సమీపాన ఉన్న మలుపు వద్ద ఎదరుగా వచ్చిన లారీ ఢీకొంది. తలకు గాయాలై ఎల్లప్ప మృతిచెందాడు. అతడు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తండ్రి మహిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనమా నిర్వహించి మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
Updated Date - 2022-01-25T05:08:03+05:30 IST