లోపించిన పారిశుధ్యం
ABN, First Publish Date - 2022-04-30T04:41:47+05:30
లోపించిన పారిశుధ్యం
- ఇందిరానగర్, ఆదర్శనగర్, పద్మశాలి కాలనీల్లో రోడ్లపై పారుతున్న మురుగు
- కాల్వల నిర్మాణానికి చొరవ చూపని పాలకవర్గం
ఆమనగల్లు ,ఏప్రిల్ 29: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు ఇందిరానగర్, ఆదర్శనగర్ , పద్మశాలి కాలనీల్లో పారిశుధ్యం లోపించింది. కాలనీలలో చాలా చోట్ల మురుగు నీరు రోడ్లపై పారుతూ దుర్గంధం వెదజల్లుతుంది. రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య పనులు, మురుగు కాల్వల నిర్మాణం, మరమ్మతుల గురించి మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీల వాసులు వాపోతున్నారు. ఇందిరానగర్ కాలనీలో ఇళ్ల నుంచి వస్తున్న మురుగునీరు శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై పారుతోంది. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో ప్రధాన రహదారిని అనుసరించి వర్షంనీరు పోవడానికి కాల్వను నిర్మించారు. కాగా కాలనీలో రెండు మూడు ఇళ్లు కాల్వ నిర్మాణానికి అడ్డుగా రావడంతో అప్పట్లో నిర్మాణం రెండు వైపులా చేసి మధ్యలో కొంతమేర అసంపూర్తిగా వదిలేశారు. ఆ తర్వాత కాలనీ వాసుల విన్నపం మేరకు కౌన్సిలర్ బైకని యాదమ్మ శ్రీశైలం చొరవ తీసుకొని కాల్వకు మధ్యలో పైపులైన్ ఏర్పాటు చేసి తాత్కలికంగా మురుగు నీరు రోడ్డుపై పారకుండా చర్యలు చేపట్టారు. కాగా రెండు నెలల క్రితం పైపులైన్ నిండుకొని మురుగునీరు మళ్లీ రోడ్డుపైకి వస్తోంది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిదంగా పద్మశాలి కాలనీ, ఆదర్శనగర్ కాలనీల్లో కూడా చాలా చోట్ల మురుగు కాల్వలు లేక మురుగు నీరు రోడ్లపై పారుతుంది. ఆదర్శనగర్ కాలనీలో తాగునీటి పైపులైన్ నిర్మాణం చేపట్టి నాలుగు నెలలు గడిచినా నేటికి నీటి కనెక్షన్ ఇవ్వకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతుందని స్థానికులు వాపోతున్నారు. పలు చోట్ల మ్యాన్హోల్స్పై మూతలు పాడై ప్రమాదకరంగా మారాయి. ఆయా కాలనీల్లో అంతర్గత రోడ్లు కూడా సీసీకి నోచుకోక కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పారిశుధ్య నిర్వాహణ విషయంలో మున్సిపాలిటీ పాలక వర్గం, అధికారుల నిర్లక్ష్యంతో 11వ వార్డులో సమస్యలు పరిష్కారానికి నోచడం లేదు. ఇప్పటికైన మున్సిఫల్ అధికారులు స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతామని స్థానికులు పేర్కొన్నారు.
Updated Date - 2022-04-30T04:41:47+05:30 IST