గ్రామానికో క్రీడా ప్రాంగణం
ABN, First Publish Date - 2022-06-01T05:54:00+05:30
గ్రామానికో క్రీడా ప్రాంగణం
- యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే లక్ష్యం
- జిల్లాలో ఇప్పటికే స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి
- చురుగ్గా సాగుతున్న పనులు
- మండలానికి 2 గ్రామాల్లో ప్రారంభించేందుకు చర్యలు
క్రీడాభిమానులకు శుభవార్త. క్రీడాస్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్న క్రీడాకారుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే క్రీడా ప్రాంగణాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి విడతలో జిల్లాలో కొన్నింటిని రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్ రెండున ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాంగణాలు అందుబాటులోకి వస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి.
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్, మే 31 : భవిష్యత్ తరాలు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో ’తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు కానుంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ యువకులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ నిధులతో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించనుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని అనేక గ్రామాల్లో ఖాళీ స్థలాలను ఎంపిక ప్రక్రియను తహసీల్దారు, ఎంపీడీవోలు, ఎన్ఆర్ఈజీఎ్స సిబ్బంది మొదలు పెట్టారు. స్థలాల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో క్రీడా ప్రాంగణ పనులు ఊపందుకున్నాయి. వచ్చే నెల రెండో తేదీలోగా మండలానికి రెండు గ్రామాల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఎకరం స్థలంలో నిర్మాణం..
తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఎకరం స్థలంలో నిర్మించనున్నారు. అందులో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్జం్పలో మెలకవలు నేర్చుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వ్యాయామ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఒక్కో క్రీడా ప్రాంగణం నిర్మాణానికి రూ.4.5 లక్షలు వెచ్చిస్తున్నారు. క్రీడా ప్రాంగణంలో ఇనుప పోల్స్, హుడ్పోల్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా వాకింగ్ట్రాక్ను ఏర్పాటు చేయనన్నారు. ముందుగా స్థలాన్ని చదును చేసిన తర్వాత క్రీడలకు సంబంధించిన కొలతల మేరకు మైదానాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి.
మొక్కల పెంపకం..
ఇక ప్రాంగణం చుట్టూ ఆహ్లాదకరంగా ఉండేలా వేప, గుల్మోహర్, సిస్సూ, బాదం, కానుగ, తంగేడు, చింత తదితర మొక్కలు నాటనున్నారు. ప్రాంగణం మధ్యలో వార్ఫాల్స్, ఫౌంటెన్ ఏర్పాటు చేయనున్నారు. మొక్కల సంరక్షణ కోసం ఈజీఎస్ ద్వారా నిధులు ఖర్చు చేయనున్నారు.
ఊపందుకున్న పనులు
గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం జిల్లావ్యాప్తంగా 27 మండలాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 863 గ్రామాల్లో ’తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు కానున్నాయి. ఇందులో ఇప్పటివరకు గ్రామీణ మండలాల్లోని 402 గ్రామాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించారు. పైలెట్ ప్రాజెక్టు కింద మండలానికి రెండు గ్రామాల్లో ’తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. జూన్ 2న 42 గ్రామాల్లో ముందస్తుగా ‘గ్రామీణ క్రీడా కమీటీల’ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు కొన్ని గ్రామాల్లో ప్రాంగణాలను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. సమయం దగ్గర పడుతుండటంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ’తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం భూమిని గుర్తించిన గ్రామాల్లో భూమి చదును పనులు ఊపందుకున్నాయి. వీలైనంత త్వరగా క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జూన్ 2వరకు పనులు పూర్తయ్యే గ్రామాలు
మండలం గ్రామాలు
అబ్దుల్లాపూర్మెట్ పిగ్లీపూర్, అబ్దుల్లాపూర్
ఆమనగల్లు ఆకుతోటపల్లి, చింతపల్లి
చేవెళ్ల ఆలూరు, కందాడ
చౌదరిగూడ తూంపల్లి, వనంపల్లి
ఫరూక్నగర్ బూర్గుల, చౌలపల్లి
ఇబ్రహీంపట్నం చర్లపటేల్గూడ, దండుమైలారం
కడ్తాల్ పీవీబాయ్తండా, గడ్డమీది తండా
కందుకూరు మీర్ఖాన్పేట, పులిమామిడి
కేశంపేట పాపిరెడ్డిగూడ, అల్వాల్
కొందుర్గు ఉమ్మెంతాల, చుక్కాపూర్
కొత్తూరు పెంజర్ల, ఇన్ముల్నర్వ
మాడ్గుల మాడ్గుల, చంద్రగడ్డ తండా
మహేశ్వరం అమీర్పేట, సిరిగిర్పూర్
మంచాల మంచాల, ఆగపల్లి
మొయినాబాద్ చిన్నమంగళారం, అమ్డాపూర్
నందిగామ వీర్లపల్లి, గణాపూర్
షాబాద్ బోడంపహాడ్, సర్దార్నగర్
శంషాబాద్ పెద్దతూప్ర, పెద్దషాపూర్
శంకర్పల్లి పర్వేద, మోకిల
తలకొండపల్లి వెల్జాల. వెంకటాపూర్
యాచారం గున్గల్, మల్కిజ్గూడెం
Updated Date - 2022-06-01T05:54:00+05:30 IST