సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
ABN, First Publish Date - 2022-03-06T05:09:05+05:30
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
- వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి
మర్పల్లి, మార్చి 5: సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించవచ్చని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో ఏర్పాటుచేసిన 32 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో ఎలాంటి అలజడి జరిగినా గ్రామస్థులతోపాటు పోలీసులకు కూడా క్షణంలో తెలిసిపోతుందని, సీసీ కెమెరాలు అమర్చడమే కాకుండా వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ మల్లయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామస్థులకు హెల్మెట్ల పంపిణీ
చాలామంది నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వారి కుటుంబానికి కూడా తీరని శోకాన్ని మిగుల్చుతున్నారని ఎస్పీ అన్నారు. సిరిపురం గ్రామంలో 150 మంది గ్రామస్థులకు ఎస్పీ చేతుల మీదుగా ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ తీసుకున్న వారు వాటిని ధరించకుండా వాహనాలు నడిపితే భారీ జరిమానా విధిస్తామని అన్నారు. అనంతరం గ్రామస్థులతో బైక్లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మోమిన్పేట సీఐ వెంకటేషం, మర్పల్లి ఎస్ఐ రాజేంద్రప్రసాద్, సర్పంచ్ మల్లయ్య, హెల్మెట్ల దాత రాజేష్ గౌడ్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T05:09:05+05:30 IST