మహాశివరాత్రికి భూకైలాస్ ముస్తాబు
ABN, First Publish Date - 2022-02-27T05:51:44+05:30
మహాశివరాత్రికి భూకైలాస్ ముస్తాబు
- నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తాండూరు రూరల్, ఫిబ్రవరి 26 : ప్రఖ్యాతిగాంచిన భూ కైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానంలో నేటి(ఆదివారం) నుంచి మార్చి 2వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాండూరు మండలం అంతారం తండాలో గల ఈ ప్రసిద్ధ ఆలయంలో ప్రతీయేటా మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా భూకైలాస్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నేటి నుంచి మార్చి 2 వరకు ప్రధాన కార్యక్రమాలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ వ్యవస్థాపకులు వాసునాయక్ పవార్, ఆల్ ఇండియా బంజారా సంఘం ప్రతినిధి శంకర్నాయక్ పేర్కొన్నారు. ఈసారి భూకైలా్సలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తిభావంతోపాటు కనువిందు చేసేలా ఆలయాన్ని ముస్తాబు చేసినట్లు వారు పేర్కొన్నారు.
- మూడు రోజులుగా నిర్వహించే కార్యక్రమాలు
నేడు(ఆదివారం) ఉదయం ఽధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, ఆవాహిత దేవతా కలశ స్థాపనం, సత్యహపుణ్య ఆవాసం, నందిసమారాధం, అష్టదిగ్బంధనం, మంటపదేవతల పూజ, రుద్రయాగం, చండీయాగం, సాయంకాలం మంగళహారతి, 28న తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఉదయం రుద్రాభిషేకం, హోమం, మహామంగళహారతి, రుద్రాభిషేకం, రాత్రి 12 గంటలకు నందీసేవా, మహామంగళహారతి, 1వ తేదీన నందికోలం, అగ్నిగుండ ప్రవేశం, రాత్రి ఒంటిగంటకు లింగోద్భవం, ఏకాదశ రుద్రాభిషేకం, పారాయణం, 2వ తేదీన శివపార్వతుల కల్యాణం, పూర్ణాహుతి, గిరిజనుల కోటాల దృష్యాలు, వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అన్నదాన కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాలు జరుగుతాయి. కాగా, భూలోక కైలాసంగా విరాజిల్లుతున్న ఈ ఆలయానికి శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు వికారాబాద్ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు.
Updated Date - 2022-02-27T05:51:44+05:30 IST