పొదుపులో మహిళల ముందడుగు
ABN, First Publish Date - 2022-07-07T05:08:32+05:30
రాష్ట్రంలో మహిళల్లో చైతన్యం మరింత పెరిగిందని, పొదుపులో
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, జూలై 6 : రాష్ట్రంలో మహిళల్లో చైతన్యం మరింత పెరిగిందని, పొదుపులో ముందడుగు వేస్తూ ఆర్థికంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని విద్యాశాఖమంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండలం మన్సాన్పల్లిలో డ్వాక్రా భవన నిర్మాణానికి శంకుస్ధాపన, ఓపెన్ జిమ్, తెలంగాణ క్రీడా మైదానాలకు జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు ఎస్సీ కమ్యూనిటీహాలు వద్ద బాబు జగ్జీవన్రామ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళల కుటుంబ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల రుణాలు అందించడానికి ముందుకు వచ్చిందన్నారు. మోదీప్రభుత్వం నిత్యావసర, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై మోపుతుందని విమర్శించారు. పరేడ్గ్రౌండ్లో అమిత్షా, మోదీ పెట్టిన సభకు మహిళలు రాలేదని.. ధరల పెరుగుదలపై మహిళలు నిలదీస్తారనే వారిని పిలవలేదన్నారు. గ్రామాల్లో సొంత స్థలం ఉన్నవారు ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత భోజనంతోపాటు బుక్స్, యూనిఫాం ఆంగ్లమాద్యమంలో బోధన అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, పింఛన్లు అందిస్తామని అన్నారు. అనంతరం మన్సాన్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సరఫరాను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ కె. రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ ఆర్.సునితాఅంద్యానాయక్, సర్పంచ్ కంది అరుణరమేష్, ఉపసర్పంచ్ నర్సింహ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంగోత్రాజునాయక్, ప్రధాన కార్యదర్శి మర్యాద రాఘవేందర్రెడ్డి, శివగంగ ఆలయకమిటీ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, నాయకులు కూనయాదయ్య, అంబయ్య, చంద్రయ్య, వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ ఆర్పి.జ్యోతి, ఎంపీడీవో. నర్సింహులు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-07T05:08:32+05:30 IST