ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేనూ టచ్ చేయలేరు
ABN, First Publish Date - 2022-07-05T09:38:06+05:30
‘కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు.. కనీసం ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా టచ్ చేయలేరు.
- మా సర్కార్ను పడగొట్టే దమ్ముందా?
- ముందు.. మీ ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకోండి
- బీజేపీ నేతలనుద్దేశించి గంగుల కమలాకర్
కరీంనగర్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ‘కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు.. కనీసం ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా టచ్ చేయలేరు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. సీఎం కేసీఆర్ నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా వేరు చేయలేరు. ముందు మీకున్న ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకోండి’ అని బీజేపీ నేతలనుద్దేశించి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి తయారైన పార్టీ టీఆర్ఎస్ అని, ప్రజల గుండె చప్పుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ జన గణనపై ప్రకటన చేస్తారని ఆశించామని పేర్కొన్నారు. ఈ మూడు ప్రధాన డిమాండ్లలో ఏ ఒక్కదానిపై ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు.
కేంద్రప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలోని 2,950 రైసుమిల్లులు 28 రోజులుగా మూతపడి లక్షలాది కుటుంబాలు ఉపాధి లేక రోడ్డునపడితే ప్రధాని ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్రం కుంటిసాకులు చెబుతోందని, రైసుమిల్లుల్లో 93.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, వీటి విలువ 22,600 కోట్ల రూపాయల విలువ ఉంటుందన్నారు. ధాన్యం నాణ్యత దెబ్బ తింటే కేంద్రం బాధ్యత వహిస్తుందా? దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు.
Updated Date - 2022-07-05T09:38:06+05:30 IST