కన్నతల్లిని కడతేర్చిన కసాయి
ABN, First Publish Date - 2022-03-13T06:46:29+05:30
నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లి.. పైగా మంచానికే పరిమితమైన వృద్ధురాలు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు తాగినమైకంలో తల్లితో గొడవపడ్డాడు.. అంతకే ఊరుకోకుండా కర్రతో ఇష్టం వచ్చినట్లు బాధాడంతో తీవ్రగాయాలపాలైన ఆ తల్లి అసువులు బాసింది.
కొడుకు చేతిలో హత్యకు గురైన కళావతి
తాగినమైకంలో కర్రతో బాదిన శివకుమార్
తీవ్రగాయాలవడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
చికిత్సపొందుతూ మృతి
సికింద్రాపూర్లో విషాదఛాయలు
జక్రాన్పల్లి, మార్చి 12: నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లి.. పైగా మంచానికే పరిమితమైన వృద్ధురాలు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు తాగినమైకంలో తల్లితో గొడవపడ్డాడు.. అంతకే ఊరుకోకుండా కర్రతో ఇష్టం వచ్చినట్లు బాధాడంతో తీవ్రగాయాలపాలైన ఆ తల్లి అసువులు బాసింది. హృదయవిదారకమైన ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.
ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. సికింద్రాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు సంబోజి కళావతి(75), కొడుకు సంబోజి శివకుమార్, కోడలు సంబోజి లలిత ఒకే ఇంట్లో ఉంటున్నారు. మద్యానికి బానిసైన శివకుమార్ నిత్యం తాగి వచ్చి ఇంట్లో తల్లితో గొడవపడేవాడు. ఇదే క్రమంలో శనివారం తాగివచ్చిన శివకుమార్ తల్లితో గొడవకు దిగాడు. తాగినమైకంలో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైన తల్లి కళావతిని కర్రతో బాధడంతో తీవ్ర గాయాలపాలైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థులతో సహాయంతో పోలీసులు వృద్ధురాలైన కళావతిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కళావతి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, రోజూ తాగివచ్చి గొడవపడడంతో భార్య లలిత ఇటీవల పదిహేను రోజుల క్రితమే పుట్టింటికి వెళ్లిందని ఎస్సై తెలిపారు. ఈ సంఘటనపై క్షుణ్ణంగా విచారిస్తామని, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.
Updated Date - 2022-03-13T06:46:29+05:30 IST