గుట్టుగా గుట్కా దందా
ABN, First Publish Date - 2022-03-18T04:24:18+05:30
జిల్లాలో నిషేధిత గుట్కా విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదు. చట్టాల్లోని లొసుగులు, ఇంటి దొంగల సహకారంతో జిల్లాలో కొందరు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు.
- జిల్లాలో ఆగని గుట్కా విక్రయాలు
- కామారెడ్డి, బాన్సువాడలో భారీగా బయటపడుతున్న గుట్కా నిల్వలు
- ఇటీవల లక్షల విలువ చేసే గుట్కా స్వాధీనం
- గతంలో జిల్లా కేంద్రంలోనే యథేచ్ఛగా గుట్కా తయారీ చేస్తూ పట్టుబడిన ముఠా
- గుట్టు చప్పుడు కాకుండా దుకాణాలు, పాన్షాపుల్లో విక్రయాలు
- రూ. కోట్లలో సాగుతున్న గుట్కా వ్యాపారం
- పట్టణ కేంద్రాల్లో భారీగా నిల్వలు ఉన్నప్పటికీ అంతంత మాత్రంగానే దాడులు
- పోలీసులు దాడులు చేసి కేసులు పెట్టినా ఆగని దందా
కామారెడ్డి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిషేధిత గుట్కా విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదు. చట్టాల్లోని లొసుగులు, ఇంటి దొంగల సహకారంతో జిల్లాలో కొందరు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. హత్య కేసులను రోజుల వ్యవధిలోనే ఛేదించగల సత్తా ఉన్న మన పోలీసులు విచ్చలవిడిగా బస్తాల కొద్దీ గుట్కా ప్యాకెట్లు జిల్లాలోకి వస్తున్న, ఏకంగా జిల్లా కేంద్రంలోనే యథేచ్ఛగా గుట్కా తయారీ చేస్తూ పట్టుబడినా ఎందుకు నిలువరించడం లేదో అర్థం కానీ పరిస్థితి. పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి పెద్ద మొత్తంలోనే జిల్లాకు గుట్కాను తరలిస్తున్నప్పటికీ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వెలువడుతున్నాయి. గతంలో ప్రభుత్వ ఆదేశాలతో గుట్కాపై ఉరుకులు పరుగులతో పోలీసులు దాడులు చేసి పట్టుకున్నప్పటికీ ఇటీవల కాలంలో పోలీసుల తనిఖీలు లేకపోవడంతో గుట్కా ముఠా యథేచ్ఛగా దందా సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
బయటపడుతున్న గుట్కా నిల్వలు
కామారెడ్డి, బాన్సువాడ పట్టణ కేంద్రాలతో పాటు మరికొన్ని మండల కేంద్రాల్లో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల తనిఖీల్లో గుట్టలు గుట్టలుగా గుట్కా నిల్వలు బయటపడుతున్నాయి. ఇటీవల కామారెడ్డి పట్టణంలో పక్షం రోజుల్లోనే రూ. లక్షల్లో విలువ చేసే గుట్కా నిల్వలపై పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. అశోక్నగర్ ప్రాంతంలో ఓ గోదాంలో భారీగా గుట్కా బస్తాలను పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత పలు దుకాణాలలో సైతం పెద్ద మొత్తంలోనే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం హరిజన ప్రాంతంలో ఓ ఇంట్లో రూ.50వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది కిందట కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే గుట్కా తయారీ కేంద్రాన్నే ఏర్పాటు చేశారంటే పోలీసులు ఏ విధమైన పర్యవేక్షణ చేస్తున్నారో.. ఇంటి దొంగలు ఏ విధంగా సహకరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కామారెడ్డిలోనే కాకుండా బాన్సువాడలోనూ నెల రోజుల కిందట రూ.1 లక్ష విలువ చేసే గుట్కా నిల్వలపై దాడులు చేసి పెద్ద మొత్తంలోనే సీజ్ చేశారు. మహారాష్ట్ర నుంచి మద్నూర్ చెక్పోస్టు మీదుగా కామారెడ్డికి గుట్కా తరలిస్తున్న టాటా ఏసీని పోలీసులు పట్టుకుని సీజ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సీసీఎస్, టాస్క్ఫోర్స్ దాడులలో లక్షల్లోనే దొరుకుతున్న గుట్కా ప్యాకెట్లను చూస్తే ఏ స్థాయిలో ఈ ప్రాంత పోలీసుల పనితీరు ఉందో అర్థం చేసుకోవచ్చు. కిందిస్థాయి సిబ్బంది ఆయా దుకాణాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దాడుల విషయం ముందే సమాచారం చేరవేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
సరిహద్దు రాష్ర్టాల నుంచి జిల్లాకు తరలింపు
తెలంగాణలో గుట్కాపై నిషేధం ఉంది. పక్క రాష్ర్టాలైనా మహారాష్ట్ర, కర్ణాటకలు గుట్కా విక్రయాలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఈ రెండు రాష్ర్టాలకు సరిహద్దులుగా ఉండటంతో గుట్కా ముఠా యథేచ్ఛగా జిల్లాకు తరలిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలైనా ఔరంగాబాద్, బీదర్, బెంగుళూర్, నారాయణ్ఖేడ్ ప్రాంతాల నుంచి ఎక్కువగా గుట్కా స్థావరాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి గుట్కా రవాణా చేసే అక్రమార్కులు బస్సుల్లో, టాటా మ్యాజిక్ ఆటో, కార్లలో, ద్విచక్ర వాహనాలపై పోలీసుల కంట పడకుండా బిచ్కుంద, పిట్లం, మద్నూర్, జుక్కల్ మీదుగా వయా బాన్సువాడ పట్టణం మీదుగా కామారెడ్డి ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పాన్షాపుల్లో, దుకాణాల్లో గుట్కాలను విక్రయిస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలైన జుక్కల్, మద్నూర్, బిచ్కుంద ప్రాంతాల నుంచి అక్రమమార్గం ఎంచుకున్న గుట్కా ముఠా ఔరంగాబాద్, కర్ణాటక రాష్ర్టాల నుంచి సరఫరా చేస్తున్నారు. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాలు గుట్కాలకు కేంద్రాలుగా మారాయని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఔరంగాబాద్, బెంగుళూర్ ప్రాంతాల నుంచి జిల్లాకు తరలిస్తున్న భారీ మొత్తంలో గుట్కాను పిట్లం, బిచ్కుంద, బాన్సువాడ, గాంధారిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.
కోట్లలో గుట్కా దందా
జిల్లాలో కోట్ల రూపాయల్లోనే గుట్కా దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కామారెడ్డి జిల్లా పిట్లం, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ ప్రాంతాల మీదుగా నిజామాబాద్తో పాటు సిరిసిల్లా, కరీంనగర్, జగిత్యాల తదితర ప్రాంతాలకు వాహనాల్లో గుట్కా సరఫరా అవుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా పోలీసుల కళ్లు కప్పి హోల్సేల్ దుకాణాలకు గుట్కా ముఠా సరఫరా చేస్తోంది. అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నా దందా మాత్రం ఆగడం లేదు. జిల్లాలో నెలకు రూ. 10 కోట్ల విలువైన గుట్కా విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం గుట్కాపై పోలీసుల తనిఖీలు లేకపోవడంతో పాన్షాపుల్లో, దుకాణాల్లో బహిరంగంగానే విక్రయిస్తున్నారు. ఈ గుట్కా దందాలో సగానికి సగం లాభం ఉంటుందని వ్యాపారులు సైతం అంటున్నారు. పెద్ద మొత్తంలో ఆదాయం ఉండటంతో పోలీసులకు పట్టుబడి కేసులు నమోదైనా బెయిల్ పొంది అదే దందాను కొనసాగిస్తున్నారు.
కేసులు పెట్టినా ఆగని దందా
గుట్కా, తంబాకు, పాన్ మసాల వంటి మత్తు పదార్థాలైన ప్యాకెట్లను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ నిషేధించింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా గుట్కా విక్రయాలు జరుగకుండా చూడాలని పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదట్లో పోలీసులు హడావిడి చేస్తూ గుట్కా గోదాంలపై, దుకాణాలపై, పాన్షాపులపై వరుసగా దాడులు చేస్తూ భారీ మొత్తంలోనే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా దందా కొనసాగించే ముఠాపై పోలీసుశాఖ నామమాత్రపు కేసులు నమోదు చేయడంతో ముఠా సభ్యులు బెయిల్పై వచ్చి తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గుట్కా జిల్లాకు సరఫరా చేయడం ఇక్కడ నుంచి పొరుగు జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్లా, సిద్దిపేట్ తదితర ప్రాంతాలకు ముఠా భారీగానే తరలిస్తోంది. జిల్లాలోని మారుమూల మండలాల్లోనే కాకుండా బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి పట్టణ కేంద్రాల్లోనూ రహస్య ప్రాంతాల్లో గుట్కా డంప్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని నిఘా వర్గాలు స్థానిక పోలీసులకు అందించిన గుట్కా ముఠాతో ఉన్న సంబంధాల నేపథ్యంలో అంతంత మాత్రంగానే దాడులు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Updated Date - 2022-03-18T04:24:18+05:30 IST