NITI Aayog: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: కేసీఆర్
ABN, First Publish Date - 2022-08-06T22:04:02+05:30
ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు.
హైదరాబాద్: ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ (Prime Minister Modi)కి బహిరంగ లేఖ రాశామని తెలిపారు. మిషన్ కాకతీయ (Mission Kakatiya)కు రూ.5 వేల కోట్ల గ్రాంట్, మిషన్ భగీరథకు రూ.19,500 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని తెలిపారు. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నామని తెలిపారు. చెబితే విని అమలు చేసే సంస్కారం ఆనాటి ప్రధానులకు ఉండేదని, లేఖ ద్వారా తమ నిరసనను ప్రధానికి తెలియజేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కేంద్రానివి అన్నీ ఏకపక్ష నిర్ణయాలేనని తప్పుబట్టారు. ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్రం కొత్త నిబంధనలు తెచ్చిందని, కొత్త నిబంధనలతో తెలంగాణ రాష్ట్రానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి సాధ్యమవుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, రూపాయి విలువ పడిపోయిందని పేర్కొన్నారు. నిరుద్యోగం పెరిగిపోయిందని, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు.
Updated Date - 2022-08-06T22:04:02+05:30 IST