కలవరపెడుతున్న కరోనా
ABN, First Publish Date - 2022-01-26T06:05:01+05:30
ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మంగళవారం ఒక్క రోజే 1070 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో వేగంగా వ్యాపిస్తున్న వైరస్
రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు
(సూర్యాపేటటౌన్, చివ్వెంల, దేవరకొండ, వలిగొండ, ఆత్మకూరు(ఎం), మునుగోడు, కట్టంగూర్, వేములపల్లి, కేతేపల్లి, నాగార్జునసాగర్)
ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మంగళవారం ఒక్క రోజే 1070 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి కే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువు రు అధికారులు, ప్రజాప్రతినిధులు, బ్యాంక్ సిబ్బంది వైరస్ బారినపడి హోంక్వారంటైన్లో ఉన్నారు.
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేసిబ్బంది, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడుతుండటం కలవరానికి గురిచేస్తోంది. ఇటీవల సూర్యాపేట మునిసిపల్ కార్యాలయంలో 8మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా నల్లగొండ మునిసిపల్ కమిషనర్,పలువురు సిబ్బందికి, చండూరు, భువనగిరి మునిసిపాలిటీ లో సైతం పలువురు సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా పలువురు పోలీస్ సిబ్బందితోపాటు, వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బందిని సైతం వైరస్ విడిచిపెట్టడంలేదు. ప్రభు త్వం ఈ నెల 21వ తేదీ నుంచి జ్వర సర్వే నిర్వహిస్తుండగా, వేల మందికి కొవిడ్ లక్షణాలు బయటపడుతున్నాయి. వీరందరికీ వైద్యసిబ్బంది మందుల కిట్ అందజేసి హోంక్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు. కరోనా విజృభిస్తున్నా నేటికీ కొంతమంది మాస్క్లేకుండానే బయట తిరుగుతున్నారు. భౌతికదూరం పాటించడంలేదు. హోటళ్లు, సినిమా హాళ్లు, మద్యం దుకాణాల వద్ద కరోనా నిబంధన కనిపించడంలేదు.
ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి కరోనా
సూర్యాపేట మునిసిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు బిల్ కలెక్టర్లకు, ఒక మెప్మా అధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరితో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ , ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారికి సైతం కరోనా సోకిన ట్లు తెలిసింది. అంతేగాక ముగ్గురు కౌన్సిలర్లకు సైతం పాజిటివ్ వచ్చింది. చివ్వెంల మండల తహసీల్దార్ కార్యాలయం లో డిప్యూటీ తహసీల్దార్తో పాటు ఇద్దరు వీఆర్ ఏలకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతోపాటు ఎస్ఐకు, ఉపాధిహామీ పథకం ఏపీవో, కంప్యూటర్ ఆపరేటర్ సైతం కరోనా బారినపడ్డారు. నాగార్జునసాగర్లోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో ఏడుగురు సిబ్బంది, ఒక రోగికి కరోనా పాజిటివ్ నమోదైంది. ఆస్పత్రిలో మంగళవారం 150 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హిల్కాలనీలో 46 కేసులు, పైలాన్కాలనీలో ఎనిమిది కేసులు నమోదు కాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఏడుగురికి పాజిటివ్ నమోదైంది. దేవరకొండ డివిజన్లో 150 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దేవరకొండలో 53మందికి, చందంపేట, చింతపల్లిలో ఇద్దరి చొప్పున, డిండి, పీఏపల్లిలో తొమ్మిదిమంది చొప్పున, గుడిపల్లిలో ఐదుగురికి, గుర్రంపోడులో 18 మందికి, కొండమల్లేపల్లిలో 32 మందికి, బొడ్డుపల్లి, వీటీనగర్లో ఒకరి చొప్పున, మర్రిగూడ మండలంలో 10 మందికి, నాంపల్లిలో ఎనిమిది మందికి, కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వలిగొండ మండలంలో 37 మందికి, ఆత్మకూరు(ఎం) మండలంలో 21 మందికి, మునుగోడు మండలంలో 33మందికి, కట్టంగూర్ మండలంలో 24 మం దికి, వేములపల్లి మండలంలో 18మందికి, కేతేపల్లి మండలంలో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. పలువురు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు సైతం పాజిటివ్ వచ్చింది. కాగా, మునిసిపల్ సిబ్బంది వైరస్ బారినపడటంతో సూర్యాపేట మునిసిపల్ కార్యాలయానికి వచ్చేవారు విజ్ఞాపనలు అందజేసేందుకు కార్యాలయ ఆవరణలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేశారు.
27,424 మందికి జ్వరమొచ్చింది
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ నుంచి జ్వర సర్వే నిర్వహిస్తోంది. దీంతో కరోనా కేసులు భారీగా బయటపడుతున్నాయి. జ్వరం, జలుబుతో పాటు దగ్గు వంటి కరో నా లక్షణాలు చాలామందిలో కన్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 8,22,940 ఇళ్లను వైద్యశాఖ బృం దాలు సర్వే చేయగా, ఇప్పటి వరకు 27,424 మందికి కొవిడ్ లక్షణాలను గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం 3,107 బృందాలు ఈ సర్వేను నిర్వహిస్తున్నాయి. మొత్తం 38.33లక్షల మందిని ఈ బృం దాలు పలకరించనున్నాయి. నల్లగొండ జిల్లాలో 17.43 లక్షల మంది జనాభా ఉండగా, 4లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలను 1,350 బృందాలు సర్వే చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో 13లక్షల జనాభాకు 1,000 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు 2.70కుటుంబాలను విచారించనున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 7,97,375 మంది తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. 6,93,569 మంది రెండో డోస్ పూర్తయింది. మరో 3వేల మందికిపైగా బూస్టర్ డోస్ వేసుకున్నారు. యాదాద్రి జిల్లాలో మొదటి డోస్ 5,67,835 మంది, రెండో డోస్ 4,70,702 మంది తీసుకున్నారు. 15-18ఏళ్ల పిల్లలు 23,143 మంది వ్యాక్సిన్ వేయించుకోగా, బూస్టర్ డోస్ 2,850 మందికి వేయించుకున్నారు.
వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో కేసులు ఇలా
తేదీ పాజిటివ్
కేసులు
19న 532
20న 689
21న 846
22న 868
23న 244
24న 1,190
25న 1070
మొత్తం 5,439
జ్వర సర్వే ఇలా...
జిల్లా తేదీ సర్వే చేసిన జ్వర లక్షణాలు
కుటుంబాలు ఉన్నవారు
నల్లగొండ 21న 58,400 2,040
22న 72,111 2,478
23న 68,237 2,228
24న 68,262 2,638
25న 56,647 2,480
యాదాద్రి 21న 43,758 2,551
22న 62,178 3,230
23న 56,638 2,687
24న 59,636 3,096
25న 56,923 2,408
సూర్యాపేట 21న 86,267 512
22న 32,499 390
23న 32,524 181
24న 36,652 227
25న 32,208 278
మొత్తం 8,22,940 27,424
Updated Date - 2022-01-26T06:05:01+05:30 IST