త్వరగా కొనుగోళ్లు పూర్తిచేయాలి
ABN, First Publish Date - 2022-05-19T06:32:51+05:30
వాతావరణ పరిస్థితులు మారుతున్నందున కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్
నల్లగొండ టౌన్, మే 18: వాతావరణ పరిస్థితులు మారుతున్నందున కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చాంబర్లో పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి, సహకార, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ, మిల్లర్లతో సమావేశమై యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, కొనుగోళ్ల లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు 248 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా, అందులో ఐకేపీ ద్వారా 128 కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా 112 కేంద్రాలు, మార్కెటింగ్ ద్వారా 8 కేంద్రాలు ప్రారంభించి 2లక్షల35వేల మెట్రిక్ టన్నుల ధాన్యం 37వేల467 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.210 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ నెల 31లోగా పెండింగ్లో ఉన్న 21,700 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల శాఖ డీఎం నాగేశ్వర్రావు, డీసీవో ప్రసాద్, మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, సహాయ పౌరసరఫరాల అధికారి నిత్యానందం, వ్యవసాయశాఖ ఏడీ హుస్సేన్బాబు, ఐకేపీ ఏపీడీ అరుణ్, మిల్లర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-19T06:32:51+05:30 IST