ప్రజల జీవితాలను తాకట్టుపెడుతున్న కేసీఆర్
ABN, First Publish Date - 2022-08-19T05:58:29+05:30
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు
ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకుంటున్న సీఎం
ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి
కోదాడటౌన్, ఆగస్టు 18: ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం కోదాడలో ఏర్పాటు చేసిన రైతుభరోసాయాత్ర సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏరాష్ట్రానికి లేని ఆదాయం తెలంగాణకు ఉందని, అయినా రాష్ట్ర ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి సీఎం కేసీఆర్ అప్పులు తెస్తూ, ధనికరాష్ట్రాన్ని పేదరాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. రైతు రుణమాఫీపై నోరెత్తడంలేదని, విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫీజురీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ 8శాతం కమీషన్ దండుకుంటున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి ఎమ్మెల్యే మల్లయ్య కుటుంబం వరకు ల్యాండ్, శ్యాండ్, లిక్కర్, గంజాయిలో కమీషన్లు అందుతున్నాయన్నారు. నిజాయితీగా పనిచేసే పోలీసులను బదిలీ చేసి ఏజెంట్లగా పనిచేసే పోలీసులను టీఆర్ఎస్ నాయకులు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కోదాడ నుంచి 50వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని, ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే రైతుభరోసా యాత్రలో పెద్దఎత్తున పాల్గొని విజయవతం చేయాలన్నారు. సమావేశంలో ఉత్తమ్ పద్మావతి, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు, పార సీతయ్య, బషీర్, ఆవుదొడ్డి ధనమూర్తి, శ్రీనివాసరావు, రజనీకాంత్, మాతంగి బసవయ్య, గంధం యాదగిరి పాల్గొన్నారు.
Updated Date - 2022-08-19T05:58:29+05:30 IST