వైభవంగా హనుమాన్ జయంతి
ABN, First Publish Date - 2022-05-26T07:02:06+05:30
హనుమాన్ జయంతి సందర్భంగా బుధవారం జిల్లాలోని రామాలయాలు హనుమాన్ నామస్మరణతో మార్మోగాయి.
ఆంజనేయ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
డప్పు చప్పుళ్ల మధ్య శోభాయాత్రలు
హనుమాన్ జయంతి సందర్భంగా బుధవారం జిల్లాలోని రామాలయాలు హనుమాన్ నామస్మరణతో మార్మోగాయి. రామాలయాల్లో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం పలు ప్రాంతాల్లో హనుమాన్ శోభాయాత్రను డప్పుచప్పుళ్ల మధ్య వైభవంగా సాగింది.
భువనగిరి టౌన్: పట్టణ ంలోని హనుమాన్ ఆలయాల్లో ఉదయం నుంచే జయంతి పూజలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం హనుమాన్ శోభాయాత్రను నిర్వహించారు. మాసుకుంట ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన పూజల్లో మునిసిపల్ చైర్మన్ ఎనబోయిన అంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దివ్యజీవన మురళీకృష్ణ ఆలయంలో వార్షిక పూజలను ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదగిరిగుట్ట రూరల్: గుట్టలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో డప్పుచప్పుళ్లతో, కళాకారుల ఆటపాటలతో హనుమాన్ శోభయాత్రను కొత్తగుండ్లపల్లి గ్రామం నుంచి యాదగిరిపల్లి వరకు ఎర్రటి ఎండలో రెండు కిలోమీటర్ల దూరం నిర్వహించారు. వేలాది మంది భక్తులు హనుమాన్ నామస్మరణతో కాషాయ జెండా చేబూని శోభాయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-26T07:02:06+05:30 IST