కేసీఆర్ పాలనలో దగాపడిన రైతులు
ABN, First Publish Date - 2022-06-27T07:02:57+05:30
కేసీఆర్ పాలనలో రైతాంగం దగా పడిందని, కనీసం మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని,సిగ్గుంటే సీఎం ఉరేసుకోవాలని వై ఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కరువు
సిగ్గుంటే కేసీఆర్ ఉరేసుకోవాలి
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల
చివ్వెంల, పెన్పహాడ్, జూన్ 26: కేసీఆర్ పాలనలో రైతాంగం దగా పడిందని, కనీసం మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని,సిగ్గుంటే సీఎం ఉరేసుకోవాలని వై ఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 106వ రోజు ప్రజాప్రస్థాన యాత్ర ఆదివారం పెన్పహాడ్ మండలంలోని భక్తళాపురం, భాగ్యతండా మీదుగా చివ్వెంల మండలం తిరుమలగిరి, గుంపుల, తుల్జారావుపేట గ్రామాల మీదుగా సాగింది.
తిరుమలగిరి గ్రామంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి మాటా ముచ్చట నిర్వహించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం సీఎం కేసీఆర్, తుగ్లక్ మంత్రుల పక్కన చేరిందని విమర్శించారు. మంత్రి జగదీ్షరెడ్డి దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.4లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకొచ్చిన దద్దమ్మ సీఎం కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ కుటుంబం పదవులు పంచుకోవడంలో బిజీగా ఉందని, కేటీఆర్ మినీ రాజులా వ్యవహరిస్తున్నాడని అన్నారు. తెలంగాణలో ప్రతీ కుటుంబంపై రూ.4లక్షల అప్పు పెట్టిన ఘనుడు సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథ ఓ బోగస్ ప్రాజెక్ట్ అని, గ్రామాల్లో నేటికీ తాగునీటి కటకట ఉందన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో మైనర్ బాలికపై అత్యాచా రం జరిగితే నేరస్థులకు బిర్యానీ పెడుతున్నారంటే ఎంత మూర్ఖపు పాలనో అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు రోడ్డున పడ్డారని, రుణమాఫీ కోసం చూసి రైతులు మోసపోయారని అన్నారు. కేసీఆర్ చేస్తున్న పనికిమాలిన పనులను ప్రశ్నించినందుకు కార్శిక సంఘాలను రద్దు చేశాడని అన్నారు. వైఎస్ హయాంలో పేదలకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు గోధుమలు, చక్కెర, పప్పులు ఇవ్వగా, ప్రస్తుత సీఎం కేసీఆర్ కేవ లం బియ్యం మాత్రమే ఇస్తున్నారన్నారు. పేదల సంక్షేమ వైఎస్ ఎన్నో సంక్షే మ పథకాలు అమలుచేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతుల పొలాలకు రబీ, ఖరీఫ్ రెండు సీజన్లకు సాగునీరు వస్తున్నదంటే అది వైఎస్ పుణ్యమని అన్నారు. వైఎ్సఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకరావడమే తన లక్ష్యమన్నారు. వైఎ్సఆర్ను ప్రేమించే ప్రతీ ఇంటిపై వైఎస్సార్టీపీ జెండా ఎగరాలన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఇళ్లు లేవని, ఉద్యోగాలు రావని అన్నారు. వచ్చేది వైఎస్సార్టీపీ ప్రభుత్వమని, ఆడబిడ్డల దగ్గర నుంచి ప్రతీ కుటుంబాన్ని మనమే బాగుచేసుకుందామన్నారు. తమ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే పనిచేస్తుందన్నారు. అందరికీ రూ.3 వేలు పింఛన్లు ఇస్తామన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసం డబ్బు ఇస్తే తీసుకొని, ఓటు మాత్రం అభివృద్ధి చేసే వైఎస్సార్టీపీకి వేయాలన్నారు. ఆమె వెంట నియోజకవర్గ కోఆర్డినేటర్ పిట్ట రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జేవీఆర్, నీలం రమేష్, పాదయాత్ర కన్వీనర్ దేవరం లింగారెడ్డి, అధికార ప్రతినిధి ఏపూర్ సోమన్న, బీరెళ్లి శ్రీనివా్సరెడ్డి, సత్యవతి, పచ్చిపాల వేణుయాదవ్, తదితరులు ఉన్నారు. ఆదివారం మొత్తం 14కి.మీ మేర పాదయాత్ర కొనసాగింది, ఇప్పటి వరకు 1,428 కి.మీ మేర పాదయాత్ర పూర్తయింది. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా షర్మిల పాదయాత్ర కొనసాగించారు.
Updated Date - 2022-06-27T07:02:57+05:30 IST