శేషన్న అరెస్ట్తో కలకలం
ABN, First Publish Date - 2022-09-29T05:53:44+05:30
ఎన్కౌంటర్కు గురైన గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన ఘటనతో ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతోంది. భువనగిరి పట్టణానికి చెందిన నయీం తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చే సుకున్న నేర సామ్రాజ్యంలో నెంబర్ 2గా వ్యవహరించిన శేషన్న నేరచరిత్ర మూలాలు ఉమ్మడి జిల్లాలోనూ ఉన్నాయి.
నయీం అనుచరుల్లో కలవరం
పోలీసు విచారణలో వెల్లడించే అంశాలపై నెలకొన్న ఆందోళన
2014లో నల్లగొండలో జరిగిన కొనపురి రాములు హత్య కేసులో నిందితుడు
భువనగిరి టౌన్, సెప్టెంబరు 28: ఎన్కౌంటర్కు గురైన గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన ఘటనతో ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతోంది. భువనగిరి పట్టణానికి చెందిన నయీం తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చే సుకున్న నేర సామ్రాజ్యంలో నెంబర్ 2గా వ్యవహరించిన శేషన్న నేరచరిత్ర మూలాలు ఉమ్మడి జిల్లాలోనూ ఉన్నాయి. నయీం ఆదేశాలతోనే మాజీ మావోయిస్ట్, అనంతరం టీఆర్ఎ్సలో చేరిన కొనపురి రాములు ను 2014లో నల్లగొండలో హత్యచేయగా అతనిపై నల్లగొం డ పోలీసులు కేసు నమోదు చేశారు. నయీం ఎన్కౌంటర్కు గురైన 2016, ఆగస్టు 8వ తేదీ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన శేషన్నను ఆరేళ్ల అనంతరం పోలీసులు పట్టుకోగలిగారు. అయితే నయీం జీవించి ఉన్న సమయంలోనే అత ని సూచనలతో శేషన్న ఉమ్మడి జిల్లా పరిధిలో పలు సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు ప్రచారం అయినప్పటికీ బహిర్గతంకాలేదని అలాగే పోలీసు రికార్డులకు కూడా ఎక్కలేదని పలువురు పేర్కొంటున్నారు. అయితే నయీం ముఠాపై భువనగిరి పట్టణ పోలీ్సస్టేషన్లోనే సుమారు 150కేసులు ఉండగా, ఇప్పటి వరకు సుమారు 145కేసుల్లో పోలీసులు కోర్టులలో చార్జీషీటు వేశారు. అలాగే భువనగిరి రూరల్తోపాటు జిల్లాలోని మరిన్ని పోలీ్సస్టేషన్లలో నయీం అనుచరులపై పలు కేసులు ఉండగా మెజార్టీ కేసుల్లో పోలీసులు చార్జీషీట్ కూడా వేశారు. అయితే ఏ కేసుల్లోనూ శేషన్న లేకపోవడం, కోర్టుల్లో పోలీసులు వేసిన చార్జీషీట్లలోనూ శేషన్న ప్రస్తావన లేదని తెలుస్తోంది.
నేటికీ కొనసాగుతున్న చార్జీషీట్లు
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ నయీం ముఠాపై నమోదైన కేసుల్లో పోలీసులు నేటికీ చార్జీషీట్లు వేస్తున్నారు. స్థూలంగా ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నయీం అనుచరులపై సుమారు 250కి పైగా కేసులు ఉన్నాయి. కాగా అరెస్ట్ అయిన శేషన్న పోలీసుల విచారణలో తెలిపే వివరాలకోసం ఉమ్మడి జిల్లా వాసులు ఆసక్తి చూపుతున్నారు. నయీం ముఠాతో ఉమ్మడి జిల్లాలో లబ్ధిపొందిన, నష్టపోయిన వారి వివరాలను, కొనపురి రాములు హత్య ఘటనతోపాటు మరేమైన నేర ఘటనల్లో ప్రత్యక్ష్యంగా పాల్గొన్నాడా? పాల్గొంటే అతనికి స్థానికులెవరైనా సహకరించారా అనే అంశాలు పోలీసుల విచారణలో వెలుగు చూస్తాయేమోనని, ఆవర్గాల్లో ఆందోళన నెలకొంటోంది. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, వ్యాపారులు నయీంతో అంటకాగిన ఉదంతాలు గతంలోనే విస్తృతంగా ప్రచారం జరగ్గా, కొంతమంది అరెస్ట్ వరకు వెళ్లి తమ ప్రాబల్యంతో తప్పించుకున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా ఉన్న నయీం అనుచరవర్గం, శేషన్నకు కూడా అభిమానులుగానే ఉండేవారని పోలీసులతోపాటు పలువురు పేర్కొంటున్నారు. అలాగే శేషన్న వెల్లడించిన వివరాల ఆధారంగా మరేమైనా నూతన కేసులు నమోదవుతాయేమోనని కూడా ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న నయీం వర్గం కలవరపాటుకు గురవుతున్నట్లు ప్రచారమవుతోంది.
Updated Date - 2022-09-29T05:53:44+05:30 IST