గుట్టలో సెంట్రల్ లైటింగ్
ABN, First Publish Date - 2022-12-16T01:18:15+05:30
యాదగిరిగుట్ట ప్రధాన రహదారి ఇకపై అధునాతన పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఎల్ఈడీ వెలుగులతో విరాజిల్లనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక, పర్యాటక పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదగిరిక్షేత్రానికి భక్తులు సులభతరంగా చేరుకునేందుకు వీలుగా కొండ చుట్టూ ఉన్న రహదారులను వైటీడీఏ ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణలో విస్తరించింది.
10నెలల తర్వాత వెలగనున్న విద్యుద్దీపాలు
యాదగిరిగుట్ట, డిసెంబరు 15: యాదగిరిగుట్ట ప్రధాన రహదారి ఇకపై అధునాతన పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఎల్ఈడీ వెలుగులతో విరాజిల్లనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక, పర్యాటక పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదగిరిక్షేత్రానికి భక్తులు సులభతరంగా చేరుకునేందుకు వీలుగా కొండ చుట్టూ ఉన్న రహదారులను వైటీడీఏ ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణలో విస్తరించింది. యాదగిరిగుట్టకు ప్రధానంగా హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. దీంతో భక్తుల సౌకర్యార్ధం రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ప్రధానరహదారిని విస్తరించారు. అందులో భాగంగా సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటుచేశారు. అయితే ఆలయ ఉద్ఘాటన సమయంలో వెలుగులు విరజిమ్మిన విద్యుద్దీపాలు ఆ తర్వాత 10నెలలుగా వెలగలేదు. దీంతో క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులతో పాటు స్థానికులు రాత్రి వేళల్లో ఇబ్బందులకు గురయ్యారు. దీన్ని గుర్తించి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు చొరవ తీసుకొని 10నెలలుగా ఉన్న విద్యుత్ వినియోగం బిల్లు సమస్యను తీర్చారు. విద్యుత్శాఖకు బకాయిపడిన రూ.15లక్షలను వైటీడీఏ ఇటీవల చెల్లించడంతో సెంట్రల్ లైటింగ్ పునరుద్ధరణ పనులను అధికారులు తిరిగి ప్రారంభించారు. రాయగిరి నుంచి గుట్టవరకు ఉన్న విద్యుద్దీపాల్లో చిన్నచిన్న సమస్యలను సరిచేసి పునరుద్ధరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆధ్యాత్మికతకు ఆలవాలంగా సెంట్రల్ లైటింగ్
ఆధ్యాత్మికతకు ఆలవాలంగా శ్రీవైష్ణవత్వం ఉట్టిపడేలా విద్యుత్ స్తంభాలను వినూత్న రీతిలో ఏర్పాటు చేశారు. కొండ చుట్టూ ఆరు లేన్ల రింగురోడ్డులో, రాయగిరి-గుట్ట ప్రధాన రహదారిలో ఈ విద్యుత్ స్తంభాలను అమర్చారు. రాయగిరి-గుట్ట ప్రధాన రహదారిలో సుమారు రూ.2కోట్ల వ్యయంతో శంఖు, చక్ర, తిరునామాలతో సుమారు 469 విద్యుత్ స్తంభాలను అమర్చి వాటికి 485 ఎల్ఈడీ లైట్లు అమర్చారు. ఈ రహదారిలో రెండు చోట్ల హైమాస్ట్ విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. కొండచుట్టూ ఆరు లేన్ల రింగురోడ్డులో సుమారు రూ.3కోట్ల వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. 467 విద్యుత్ స్తంభాలకు సుమారు 550 ఎల్ఈడీ లైట్లు అమర్చి, అవసరమైన ప్రాంతాల్లో 8 హైమాస్ట్ విద్యుద్దీపాలు అమర్చారు. సెంట్రల్ లైటింగ్ భువనగిరి, యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోకి వస్తాయి. రాయగిరి నుంచి వడాయిగూడెం వరకు భువనగిరి మునిసిపాలిటీ కాగా, వడాయిగూడెం నుంచి యాదగిరిగుట్ట వరకు గుట్ట మునిసిపాలిటీ పరిధిలోకి వస్తాయి. ఈ రెండు మునిసిపాలిటీలతో పాటు విద్యుత్శాఖ అధికారుల సమన్వయంతో సెంట్రల్ లైటింగ్ను పునరుద్ధరించనున్నట్టు అధికారులు తెలిపారు.
నేటి నుంచి ఎల్ఈడీ వెలుగులు : ఎరుకల సుధ, యాదగిరి గుట్ట మునిసిపల్ చైర్పర్సన్
యాదగిరిగుట్ట పట్టణవాసులు ఎదురుచూస్తున్న ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ శుక్రవారం నుంచి వెలుగులు పంచనున్నాయి. సెంట్రల్ లైటింగ్ నిర్వహణలో నెలకొన్న సమస్య ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి చొరవతో పరిష్కారమైంది. విద్యుత్శాఖ అధికారులు సెంట్రల్ లైటింగ్ విద్యుద్దీపాల పునరుద్ధరణకు మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఈ మీటర్ల బిగింపు పనులను మునిసిపల్ అధికారుల బృందం పరిశీలించింది. శుక్రవారం ఈ పనులు పూర్తిచేసి, సాయంత్రం 5.30గంటలకు బస్టాండ్ ముందున్న ట్రాన్స్ఫార్మర్ వద్ద స్విచ్ ఆన్ చేసి సెంట్రల్ లైటింగ్ను ప్రారంభిస్తాం.
Updated Date - 2022-12-16T01:18:17+05:30 IST