floods: ‘సాగర్’కు కొనసాగుతున్న వరద
ABN, First Publish Date - 2022-07-23T03:10:51+05:30
నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjunasagar project)కు ఎగువనుంచి వరద కొనసాగుతోంది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjunasagar project)కు ఎగువనుంచి వరద కొనసాగుతోంది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తుండటంతో 31,784 క్యూసెక్కులు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి 31,109 క్యూసెక్కులు మొత్తంగా 62,893 క్యూసెక్కుల వరద సాగర్కు వచ్చి చేరుతోంది. దీంతో నాలుగు రోజుల్లో సాగర్ నీటి మట్టం ఎనిమిది అడుగులు పెరిగింది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 536.40 అడుగులుగా (180.9102 టీఎంసీలు) ఉంది. సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తుండటంతో 4,204 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. సాగర్ కుడి, ఎడమ కాల్వ, వరద కాల్వకు, ఎస్ఎల్బీసీ (SLBC)కి ఎలాంటి నీటి విడుదల లేదు.
మూసీ ప్రాజెక్టుకు...
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 645 అడుగులు (4.46టీఎంసీ) కాగా, ప్రస్తుత నీటిమట్టం 639.78అడుగులుగా(3.17టీఎంసీ) ఉంది. ఎగువ నుంచి 2,162క్యూసెక్కుల ఇన్ఫ్లోతో ప్రాజెక్టు నీటిమట్టం మరింత పెరిగే వీలుంది.
పులిచింతల ప్రాజెక్టుకు...
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి 12,545 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 400 క్యూసెక్కులు లీకేజీ ద్వారా దిగువకు వెళుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175అడుగులు (45.77టీఎంసీలు) కాగా ప్రస్తుతం 169.78 అడుగులకు (38.04టీఎంసిలు) చేరుకుంది.
Updated Date - 2022-07-23T03:10:51+05:30 IST