ముసద్దీలాల్ జ్యువెలర్స్ దుకాణాల్లో పెద్ద ఎత్తున బంగారం సీజ్
ABN, First Publish Date - 2022-10-18T17:22:33+05:30
హైదరాబాద్ (Hyderabad), విజయవాడ (Vijayawada)లోని ముసద్దీలాల్ జ్యువెలర్స్ (Musaddilal jewellers) దుకాణాల్లో
హైదరాబాద్ : హైదరాబాద్ (Hyderabad), విజయవాడ (Vijayawada)లోని ముసద్దీలాల్ జ్యువెలర్స్ (Musaddilal jewellers) దుకాణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సోమవారం ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జువెలర్స్లో రెండో రోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సంస్థకు చెందిన బంగారాన్ని పెద్ద మొత్తంలో ఈడీ జప్తు చేసింది. మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (MMTC) నుంచి రూ.504 కోట్ల విలువైన బంగారాన్ని ముసద్ధిలాల్ సంస్థ తీసుకుంది. బంగారానికి డబ్బులు చెల్లించక పోగా.. ఆ బంగారాన్ని అంతా విక్రయించినట్టు ఎంఎంటీసీ గుర్తించింది. గతంలో ముసద్దిలాల్ సంస్థకు వన్ టైం సెటిల్మెంట్కు ఎంఎంటీసీ అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని కూడా సంస్థ వినియోగించుకోలేదు. దీంతో MMTC ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. బంగారం అమ్మగా వచ్చిన లాభాలను ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ గుర్తించింది. 300 కోట్ల విలువైన ఆస్తులను గత ఏడాది ఈడీ అటాచ్ చేసింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న సోదాల్లో రూ.200 కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేసే పనిలో ఈడీ ఉంది. సోమవారం నుంచి వాల్యూ వేటర్ సమక్షంలో ఈడీ బంగారం విలువ కడుతోంది.
Updated Date - 2022-10-18T17:22:33+05:30 IST