తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం:Koppula
ABN, First Publish Date - 2022-07-03T20:39:44+05:30
రాష్ట్రంలోని గురుకులాలు(telangana residential schools) దేశానికే ఆదర్శమని,ఇవి ముందుకు సాగుతున్న తీరు, సాధిస్తున్న విజయాలు, ఫలితాలు మనందరికి గర్వ కారణమని ఎస్సీవెల్ఫేర్ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(koppula eshwar) చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాలు(telangana residential schools) దేశానికే ఆదర్శమని,ఇవి ముందుకు సాగుతున్న తీరు, సాధిస్తున్న విజయాలు, ఫలితాలు మనందరికి గర్వ కారణమని ఎస్సీవెల్ఫేర్ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(koppula eshwar) చెప్పారు.కెజి నుంచి పిజి వరకు అన్ని వర్గాల వారికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని పెద్ద సంఖ్యలో నెలకొల్పారని తెలిపారు.తెలంగాణలో కొనసాగుతున్న విధంగా గురుకులాలు దేశంలో మరెక్కడా కూడా లేవని,5 సొసైటీల ఆధ్వర్యంలో 990 స్కూళ్లు గొప్పగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.వీటిలో తమ పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని,సీట్ల కోసం ప్రతి నిత్యం వందలాది మంది తమ వద్దకు వస్తుంటారని మంత్రి తెలిపారు.
పదవ తరగతి,ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల అభినందన సమావేశంమాసబ్ ట్యాంక్ లోని ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ గురుకులాల విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో గొప్పగా రాణిస్తుండడం సంతోషంగా ఉందన్నారు.కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఇవి ముందుకు సాగుతున్నాయని మంత్రి కొప్పుల వివరించారు.మారుమూల గ్రామాలకు చెందిన విద్యార్థులు ఏ మాత్రం తొణకకుండా ఇంగ్లీష్ లో మాట్లాడుతుండడం వారిలో పెరిగిన ఆత్మ స్థైర్యానికి,ఆత్మ విశ్వాసానికి నిదర్శనమన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో 75 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామని,షేక్ పేట, చిలుకూరు బాలుర,నార్సింగి, మహేంద్రహిల్స్ బాలికల స్కూళ్లను గౌలిదొడ్డి పాఠశాల మాదిరిగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా తీర్చిదిద్దుతామని వివరించారు.ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ,28 మందికి నగదు పురస్కారాలు అందజేశారు.సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్,ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణ, సొసైటీ అదనపు కార్యదర్శి హన్మంతునాయక్, అధికారులు ప్రవీణ్ కుమార్, శక్రు నాయక్, శ్రీనివాస్ రెడ్డి,చంద్రకాంత్ రెడ్డి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-03T20:39:44+05:30 IST