దొడ్డి దారిన సీఎం అయిన నువ్వు కేసీఆర్ ను విమర్శిస్తావా?
ABN, First Publish Date - 2022-01-08T20:22:25+05:30
దొడ్డిదారిన సీఎం పదవి తెచ్చుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: దొడ్డిదారిన సీఎం పదవి తెచ్చుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి ఒక ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసి సీఎం అయిన నీవా మాకు నీతులు చెప్పేది అని చౌహాన్ పై మంత్రి ద్వజమొత్తారు. 14 ఏండ్లు ఉద్యమం చేసి స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. అసలు భయం అంటేనే కేసీఆర్ డిక్షనరీలో లేదని, కేంద్ర ప్రభుత్వాలనే ఎదిరించి ధైర్యంగా పోరాడిన ఆయన మీ తాటాకు చప్పుళ్ళకు భయపడే వారు కాదని స్పష్టం చేశారు.
నల్ల సాగు చట్టాలకు వ్యతిరేఖంగా పోరాడిన రైతులను చంపిన ఘనత మీది, ఎదిరించిన వారిపై దాడుల చేసే సంస్కృతి మీది మీరా మాకు నీతులు చెప్పేది అని మండిపడ్డారు.అభివృద్ధిలో మధ్యప్రదేశ్ స్థానం ఎక్కడ? తలసరి ఆదాయంతో పాటు ఇతర రంగాల్లో అట్టడుగున ఉన్న మీ రాష్ట్రంతో మాకు పోలిక ఏంటని ప్రశ్నించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోలు ధరలపై బీజేపీ నేతలు బాధపడాలన్నారు. అధికారం, ధన వ్యామోహం తప్పా ప్రజా సమస్యలపై బీజేపీకి దృష్టి లేదన్నారు. సీఎం కేసీఆర్ బయట తిరగటం లేదన్న బీజేపీ నేతలు ప్రధాని మోదీ ఎన్నికలకు తప్ప ఏ రోజన్నా బయటకు వచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది,తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్ అయితే కార్పోరేట్ బాబుల జపం చేసే నైజం ప్రధాని మోదీ, మీ బీజేపీ ప్రభుత్వానిదని ద్వజమొత్తారు.
Updated Date - 2022-01-08T20:22:25+05:30 IST