ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు కూడా పెయిడ్ సర్వీసులు; కేసీఆర్పై విజయశాంతి ఫైర్..
ABN, First Publish Date - 2022-03-19T23:24:35+05:30
ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు కూడా పెయిడ్ సర్వీసులు; కేసీఆర్పై విజయశాంతి ఫైర్..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. పేదలకు వైద్యం అందకుండా... పైసలతో పందారం చేస్తున్న ఈ దొరల సర్కార్కు పేద ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని విజయశాంతి జోస్యం చెప్పారు. ప్రభుత్వ దవాఖానాలో పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్య సేవలు పెయిడ్ సర్వీసులుగా మరిపోతున్నాయని, ప్రతి టెస్టుకూ దారుణంగా పైసలు వసూలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..
''పేదలకు మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినవే ప్రభుత్వ ఆసుపత్రులు. కానీ, తెలంగాణలో అవి కాస్త పేదలకు దూరమవుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాలో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలు పెయిడ్ సర్వీసులుగా మరిపోతున్నాయి. ప్రతి టెస్టుకూ దారుణంగా పైసలు వసులు చేస్తున్నారు. సీటీ స్కాన్కు రూ.500 నుంచి రూ.800 వరకూ... ఎంఆర్ఐకి రూ.2వేలు పెట్ స్కాన్కు రూ.5వేలు చార్జ్ చేస్తూ పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారు. హైదారాబాద్లోని ఎంఎన్జే కేన్సర్ హాస్పిటల్లో ఎంతో కాలం నుంచీ ఇలా డబ్బులు వసులు చేస్తున్నారు. తాజాగా కోఠీలోని ఈఎన్టీ హాస్పిటల్, ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్లోనూ పైసల వసూలు కార్యక్రమం మొదలుపెట్టారు. డబ్బులెందుకని అడిగితే... కడితేనే వైద్యం, లేకుంటే లేదని మోహం మీదనే చెబుతున్నారు. డబ్బులు కట్టినట్టు రసీదు అడిగితే... ఆసుప్రతి డెవలప్మెంట్ కింద డొనేషన్ ఇచ్చినట్టు ఒక స్లిప్ ఇస్తున్నారు. డొనేషన్ అని ఎందుకు స్లిప్ ఇచ్చారని అడిగితే... రోగుల్ని దబాయించి పంపిస్తున్నారు. రాష్ట్ర సర్కార్ ఆదేశాల మేరకే చార్జీలు వసులు చేస్తున్నామని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. పేదలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తామని చెప్పి అందలం ఎక్కిన కేసీఆర్... ఇప్పుడు వాటినే దూరం చేస్తున్నాడు. ఎంఎన్జే రాష్ట్రంలో కేన్సర్ రోగులకు ట్రీట్మెంట్ అందించేందుకు ఉన్న ఏకైక సర్కార్ దవాఖాన. మూడేండ్ల నుంచీ ఇక్కడ చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే... ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు రాగానే పేషెంట్లకు రీఫండ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. కానీ ఎవరికీ పైసా రీఫండ్ చేయలేదు. మరోవైపు రూ.500తో మొదలైన చార్జీలు ఇప్పుడు వేలల్లోకి వెళ్లిపోయాయి. ఒకవేళ గాంధీ, ఉస్మానియా వంటి ఇతర దవాఖాన్ల నుంచి రిఫరల్పై వచ్చే పేషెంట్లకైతే ఇంకో రూ.వెయ్యి ఎక్కువే చార్జ్ చేస్తున్నారు. పేదలు డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే... కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకులేదు. పేదలకు వైద్యం అందకుండా... పైసలతో పందారం చేస్తున్న ఈ దొరల సర్కార్కు ఈ పేద ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టాడం ఖాయం.'' అని విజయశాంతి అన్నారు.
Updated Date - 2022-03-19T23:24:35+05:30 IST