మళ్లీ తాత్కాలిక కమిటీయే..!
ABN, First Publish Date - 2022-01-25T05:59:20+05:30
మళ్లీ తాత్కాలిక కమిటీయే..!
మేడారం ఉత్సవ కమిటీ చైర్మన్గా శివయ్య?
నేడో రేపో ఉత్తర్వులు
29న ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు
ములుగు, జనవరి 24: మేడారం మహాజాతరకు ఈసారి కూడా తాత్కాలిక ఉత్సవ పునరుద్ధరణ కమిటీయే ఏర్పాటుకానుంది. చైర్మన్, 14మంది డైరెక్టర్లతో కూడిన జాబితా సిద్ధం కాగా నేడో రేపో ఉత్తర్వులు జారీకానున్నాయి. చైర్మన్గా తాడ్వాయి మండలం కామారానికి చెందిన కొర్నిబెల్లి శివయ్యను నియమించినట్టు తెలిసింది. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉన్న కోయ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను ఎంపిక చేసినట్టు సమాచారం. జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలైన గిరిజన, గిరిజనేతరులను డైరెక్టర్లుగా నియమించారు. సోమవారం రాష్ట్ర గిరిజన, స్ర్తీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మేడారంలో పర్యటించగా మంత్రి సమక్షంలో నూతన కమిటీ ప్రమాణస్వీకారం ఉంటుందని సర్వత్రా భావించారు. అయితే ఎంపిక ప్రక్రియ పూర్తికాకపోవడంతో దేవాదాయ శాఖ నుంచి అధికారిక జీవో జారీ కాలేదు. ఈనెల 29న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతిరాథోడ్, దయాకర్రావుతోపాటు ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో జరిగిన తొలి జాతరను ట్రస్టుబోర్డు లేకుండానే తాత్కాలిక ఉత్సవ పునరుద్ధరణ కమిటీతో జరిపించారు. 2015 జూలైలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ట్రస్టుబోర్డును ఏర్పాటు చేయలేదు. ఇక అప్పటినుంచీ ఇదేతంతు కొనసాగుతోంది. జాతరకు ఆరునెలల ముందే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ జారీచేసి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఆమోదించిన త ర్వాత ఉత్తర్వులు జారీ చేస్తారు. కానీ, ముందస్తు నోటిఫికేషన్ను ఇవ్వడంలోనే ప్రభుత్వం పట్టింపులేకుండా వ్య వహరిస్తోంది. కేవలం నెలరోజుల కాలపరిమితితో ప్రస్తుతం తాత్కాలిక ఉత్సవ పునరుద్ధరణ కమిటీ నియామకం కానుం ది. ఇప్పటికే జాతరకు సం బంధించిన ప్రధానమైన పనులు 50శాతం పూర్తికాగా జాతర జరిగే ఆ నాలుగురోజులకు మాత్రమే ఈ కమిటీ పరిమితం కానుంది.
Updated Date - 2022-01-25T05:59:20+05:30 IST