కొమురవెల్లిలో సివిల్ కాంట్రాక్టర్ బలవన్మరణం
ABN, First Publish Date - 2022-01-23T04:33:00+05:30
కాంట్రాక్టు పనులు రద్దయ్యాయని మనోవేదనకు గురైన ఓ సివిల్ కాంట్రాక్టర్ సూసైడ్నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చేర్యాల, జనవరి 22: కాంట్రాక్టు పనులు రద్దయ్యాయని మనోవేదనకు గురైన ఓ సివిల్ కాంట్రాక్టర్ సూసైడ్నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం రాత్రి కొమురవెల్లి మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి గ్రామానికి చెందిన బూర్గుల వెంకటేశం (35) సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి సౌదీలో పనిచేశాడు. చాలాకాలం నుంచి ఇక్కడే స్థిరపడి నిర్మాణ కాంట్రాక్టులు నిర్వహిస్తున్న క్రమంలో కొన్ని నెలల క్రితం చేర్యాలలో జరిగిన రోడ్డుప్రమాదంలో వెంకటేశం తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అనారోగ్య పరిస్థితులతో ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఈ కారణంగా పలు కాంట్రాక్టులు రద్దవడంతో ఆర్థిక ఇబ్బందులకు తాళలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఇంట్లో సూసైడ్నోట్ రాసి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు గమనించేసరికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలుపడంతో దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, తల్లి ఉన్నారు.
Updated Date - 2022-01-23T04:33:00+05:30 IST