ఎట్టకేలకు 365బీ జాతీయ రహదారి పనులు షురూ
ABN, First Publish Date - 2022-11-18T00:10:00+05:30
సూర్యాపేట - సిరిసిల్ల 365బి జాతీయ రహదారిలో భాగంగా జనగామ నుంచి దుద్దెడ వరకు నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులలో ఎట్టకేలకు కదలికవచ్చింది. రోడ్డు విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.438 కోట్లు నిధులను మంజూరు చేసింది.
365బీ జాతీయ రహదారి పనులు షురూ
జనగామ - దుద్దెడ రోడ్డు విస్తరణ ప్రారంభం
సోలామైల్-ఆలీంపూర్ మధ్యన టోల్గేట్ ఏర్పాటుకు అవకాశం
చేర్యాల, నవంబరు 17 : సూర్యాపేట - సిరిసిల్ల 365బి జాతీయ రహదారిలో భాగంగా జనగామ నుంచి దుద్దెడ వరకు నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులలో ఎట్టకేలకు కదలికవచ్చింది. రోడ్డు విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.438 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈఏడాది జనవరిలోనే అన్ని అనుమతులు వచ్చినప్పటికీ పనులు మాత్రం ప్రారంభించలేదు. జనగామ వెళ్లే 45.57 కిలోమీటర్ల రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయమవడంతో వాహనదారులు, ప్రయాణికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. రోడ్డు పనులు త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు వేర్వేరుగా ఆందోళన కొనసాగించారు. మంత్రి హరీశ్రావు సమీక్షించి పనుల ప్రారంభానికి చొరవ తీసుకున్న క్రమంలో కాంట్రాక్టర్ ఇటీవల పనులను చేపట్టారు.
నిర్మాణ సంస్థకే రోడ్డు డిజైన్, నిర్వహణ బాధ్యతలు
రోడ్డు విస్తరణకు సంబంధించి ఉత్తరప్రదేశ్కు చెందిన ఆర్అండ్సీ కంపెనీ ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో రూ.423కోట్లతో టెండర్ను దక్కించుకున్నది. రోడ్డు డిజైన్, భూసేకరణతో పాటు నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థకే ఉండనుంది. ముందుగా దారి పొడవునా ఏర్పడిన గుంతలను ప్రస్తుతం మట్టి, మొరంతో పూడ్చివేస్తున్నారు. రోడ్ లెవల్, కల్వర్టులు, అలైన్మెంట్, విద్యుత్ లైన్, వాటర్ పైప్లైన్, ఇతరత్రా పనుల పట్ల సర్వే నిర్వహిస్తున్నారు. చేర్యాల, ముస్త్యాల, మర్రిముచ్ఛాల, సోలామైల్ ఇతర గ్రామల్లో రోడ్డుపక్కన గోతులు తీయడంతో పాటు చదును చేస్తూ లైన్క్లియర్ చేస్తున్నారు. ఆయా పనుల నిర్వహణకు సంబంధించి అంచనా నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నారు. సంబంధిత నివేదిక ఆమోదం తెలిపిన రెండు నెలలకు బీటీ రోడ్డుపనులు ప్రారంభించనున్నారు. అయితే జనగామ నుంచి దుద్దెడ క్రాస్రోడ్డు వరకు టూ లేన్ విత్ షేవ్డ్ షోల్డర్స్గా తీర్చిదిద్దనున్నారు. బీటీరోడ్డు వెడల్పు 13 నుంచి 14మీటర్లు ఉండనుంది. ఈరోడ్డుపై సెంట్రల్ లైటింగ్ నిర్మాణం అన్ని చోట్ల ఉండదు. చేర్యాల పట్టణం, మర్రిముచ్ఛాల, దుద్డెడ క్రాసింగ్రోడ్డు వద్ద మాత్రమే సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయనున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్రెడ్డినగర్- ఆలీంపూర్ మధ్యన దేవాదుల పైప్లైన్ సమీపంలో టోల్గేట్ రానుంది.
చేర్యాలలో ఇరువైపులా 50 ఫీట్ల రోడ్డు
చేర్యాల పట్టణంలో 55-60 ఫీట్లు ప్రామాణికంగా తీసుకుంటారన్న ప్రచారం జరగడంతో పలువురి ఇళ్లు, దుకాణాలు కూల్చివేస్తారని ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. కానీ ఇరువైపులా 50 ఫీట్ల వరకు మాత్రమే బీటీరోడ్డు, అందులోనే సైడ్ డ్రైనేజీ దానిపైనే ఫుట్పాత్ నిర్మించనున్నట్లు ఎన్హెచ్ అధికారులు స్పష్టం చేశారు.
Updated Date - 2022-11-18T00:18:09+05:30 IST