ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ
ABN, First Publish Date - 2022-08-10T05:18:35+05:30
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. పలు పట్టణాల్లో మహాత్మాగాంధీ జీవిత చరిత్రతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల సినిమాలను విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు తిలకించారు.
ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్, ఆగస్టు 9: పటాన్చెరు, గుమ్మడిదల, రామచంద్రాపురంలో జాతీయ పతాకాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పంపిణీ చేశారు. వెంకటేశ్వరా సినిమాహాల్లో విద్యార్థులతో కలిసి గాంధీ సినిమాను తిలకించారు. వజ్రోత్సవ మహాఘట్టాన్ని చిరస్మరణీయం చేసేందుకు పటాన్చెరు జాతీయ రహదారి పక్కన భారీ పార్కును ఏర్పాటు చేసి వజ్రోత్సవ పైలాన్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంతో పాటు మండలంలోని చిన్నచింతకుంటలో జాతీయ జెండాలను నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి నర్సాపూర్లోని థియేటర్లో గాంధీ సినిమాను తిలకించారు. నారాయణఖేడ్, పెద్దశంకరంపేటలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. నారాయణఖేడ్ పట్టణంలోని గిరిజన బాలుర సంక్షేమ పాఠశాల భవనంలో నిర్వహించిన ప్రపంచ గిరిజన దినోత్సవంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పాల్గొన్నారు. తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం వద్ద, మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ జాతీయ జెండాలను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పంపిణీ చేశారు. తూప్రాన్ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి గాంధీ సినిమాను తిలకించారు. మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ మనోహరాబాద్ మండలం చెట్లగౌరారంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. జహీరాబాద్, ఝరాసంగంలో ఎమ్మెల్యే మాణిక్రావు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి గాంధీ సినిమాను తిలకించారు. వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే మాణిక్రావు సూచించారు.
Updated Date - 2022-08-10T05:18:35+05:30 IST