తొగుట విద్యుత్ కార్యాలయ తాళం తీయరా?
ABN, First Publish Date - 2022-06-27T05:13:16+05:30
అధికారుల బాధ్యాతారాహిత్యం మూలంగా అవి నిరుపయోగంగా మారాయి. తొగుట మండల కేంద్రంలో నిర్మించిన విద్యుత్ ఏఈ కార్యాలయ తాళం కొన్ని రోజులుగా తీయకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది.
పిచ్చి మొక్కలతో నిండిపోయిన ఆవరణ
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
తొగుట, జూన్ 26: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలందించడం కోసం ప్రతీ మండల కేంద్రంలో విద్యుత్ కార్యాలయ భవనాలను ప్రభుత్వం నిర్మించింది. కానీ అధికారుల బాధ్యాతారాహిత్యం మూలంగా అవి నిరుపయోగంగా మారాయి. తొగుట మండల కేంద్రంలో నిర్మించిన విద్యుత్ ఏఈ కార్యాలయ తాళం కొన్ని రోజులుగా తీయకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు నిత్యం విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడికి రావడం, వెనుదిరగడం పరిపాటిగా మారింది. అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో పాటు కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో వెనుతిరిగి పోతున్నారు. కార్యాలయం ఇక్కడ ఉండగా మరి అధికారులు ఎక్కడ ఉంటున్నారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యాలయం గేటుకు తాళం తీయకపోవడంతో ఆవరణ మొత్తం పిచ్చిమొక్కలతో నిండిపోయి నిరుపయోగంగా మారింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ కార్యాలయంలో అందుబాటులో ఉండని అధికారులపై చర్యలు తీసుకొని కార్యాలయాన్ని వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2022-06-27T05:13:16+05:30 IST