ఇలా పని చేయడానికి సిగ్గుగాలేదా?
ABN, First Publish Date - 2022-05-18T05:12:05+05:30
హరితహారం, బృహత్ప్రకృతి వనం నిర్వహణలో అల్లాదుర్గం మండల పరిషత్ అధికారుల పని తీరుపై జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనులు చేతకాకపోతే మరోచోటికి వెళ్లిపోండి
అధికారులపై మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆగ్రహం
అల్లాదుర్గం, మే 17: హరితహారం, బృహత్ప్రకృతి వనం నిర్వహణలో అల్లాదుర్గం మండల పరిషత్ అధికారుల పని తీరుపై జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పని చేయడం సిగ్గనిపించడం లేదా అని మండిపడ్డారు. చేతకాకపోతే మరో చోటికి వెళ్లిపోవాలని సూచించారు. మంగళవారం ఆమె మండలంలోని చిల్వర్, కాయిదంపల్లి, అల్లాదుర్గం గ్రామాల్లో పర్యటించారు. కాయిదంపల్లి శివారులో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనాన్ని సందర్శించారు. బృహత్ ప్రకృతి వనంలో పది వేల మొక్కలను పెంచాల్సి ఉండగా 30 శాతం కూడా నాటకపోవడం ఏమిటని ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డిపై మండిపడ్డారు. చిల్వర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు సంబంధించిన వివరాలు తన వద్ద లేవు అని ఎంపీడీవో చెప్పడంతో అదనపు కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం కాయిదంపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. అల్లాదుర్గంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించగా.. ఎంపీపీ ఈర్ల అనీల్కుమార్రెడ్డి, సర్పంచ్ అంజీయాదవ్ పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను ఆమెకు వివరించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుందని అదనపు కలెక్టర్ చెప్పారు. ఆమె వెంట ఎంపీవో సయ్యద్, ఐకేపీ ఏపీఎం నాగరాజు, ఎంపీపీ అనీల్కుమార్రెడ్డి, సర్పంచులు భేతయ్య, అంజీయాదవ్ ఉన్నారు.
Updated Date - 2022-05-18T05:12:05+05:30 IST