జిల్లాలో శాంతిభద్రతలు బాగున్నాయి
ABN, First Publish Date - 2022-12-12T23:05:07+05:30
వనపర్తి జిల్లాలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్(హైదరాబాద్ వెస్ట్జోన్) కమల్హాసన్రెడ్డి అన్నారు.
- ఐజీ కమల్హాసన్రెడ్డి
శ్రీరంగాపురం, డిసెంబరు 12: వనపర్తి జిల్లాలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్(హైదరాబాద్ వెస్ట్జోన్) కమల్హాసన్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని శ్రీరంగాపురం పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. కొత్తగా ఏర్పడిన శ్రీరంగాపురం పోలీస్స్టేషన్లో క్రైమ్ రేటు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల రికార్డులను పరిశీలించి, కిందిస్థాయి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్స్టేషన్ పరిధిలో అమలవుతున్న క్రైమ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితిని పరిశీలించారు. శ్రీరంగనాథస్వామి ఆలయంలో సెక్యూరిటీతో పాటు, సీసీ కెమెరాల సంఖ్య పెంచాలని ఆలయ అధికారులతో మాట్లాడాలని ఎస్పీని ఆదేశించారు. పోలీస్స్టేషన్, సిబ్బంది క్వార్టర్స్కు ఎవరైనా దాతలు స్థలం ఇస్తే నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఐజీ వెంట ఎస్పీ అపూర్వారావు, డీఎస్పీ ఆనంద్రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై టీకే.మల్లేష్ ఉన్నారు.
శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఐజి
శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని హైదరాబాద్ జోన్ ఐజీ కమల్హాసన్రెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐజీని అర్చకులు శాలువాతో సన్మానించారు. ఆ తర్వాత వెండితో తయారుచేసిన వాహనాలను, నేలమాలిగలో ఉన్న తంజావూరు చిత్రాల మ్యూజియంను పరిశీలించారు. ఆలయం అద్భుతంగా ఉందని, ఆలయానికి రక్షణ కల్పించడానికి కృషి చేస్తానని అన్నారు. ఆలయంలో జరిగే పెద్ద కార్యక్రమాలకు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు.
గద్వాలలో పోలీస్ కార్యాలయం పరిశీలన
గద్వాల క్రైం : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఐజీ కమలాసన్రెడ్డి సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎస్పీ రంజన్రతన్కుమార్, డీఎస్పీ రంగస్వామి ఆయనకు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం డీఎస్పీ, సీఐ కార్యాలయాలతో పాటు, పట్టణ పోలీస్స్టేషన్ను పరిశీలించారు. అలంపూర్ సర్కిల్ ఇన్స్పెక్షన్లో భాగంగా సోమవారం ఆయన గద్వాలకు వచ్చినట్లు జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు.
Updated Date - 2022-12-12T23:05:08+05:30 IST