ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
ABN, First Publish Date - 2022-12-12T23:02:32+05:30
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
- ‘ప్రజావాణి’కి 53 ఫిర్యాదులు
గద్వాల క్రైం, డిసెంబరు 12 : ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 53 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటిక్యాల మండలం సాతర్లలోని సర్వే నెంబర్ 128, చాగాపురంలో సర్వేనెంబర్ 633 గ్రామాల పరిధి లోని భూములు వేరే వారి పేరున నమోదైనట్లు తెలిపారు. వాటిని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశించారు. గట్టు, అయిజ మండ లాల్లో భూ సమస్యలు ఉన్నాయని, వాటికి సంబంధించిన రిపోర్టులు వెంటనే ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో విద్యాశాఖకు చెందినవి రెండు, వ్యవసాయ శాఖకు చెందినవి రెండు, ఆసరా పెన్షన్లకు సంబంధించినవి 12, భూ సమస్యలపై 37 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణి ద్వారా సేవలు మరింత వేగంగా అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఏవో యాదగిరి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు ఉన్నారు.
పురస్కార గ్రహీతలకు ఘన సన్మానం
గద్వాల క్రైం : రెడ్క్రాస్ సొసైటీ ద్వారా విశిష్ఠ సేవా పతకాన్ని అందుకున్న కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఉత్తమ సేవా పథకం అందుకున్న ఎస్పీ రంజన్ రతన్ కుమార్లకు సోమవారం వారి కార్యాలయాల్లో ఉత్తమ సేవా పురస్కార గ్రహీత సంగాల అయ్యపురెడ్డి పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. వీరు ఈ నెల 15న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా పురస్కా రాలు అందుకోనున్నారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ రమేష్, కార్యనిర్వాహక సభ్యులు పటేల్ ప్రభాకర్రెడ్డి, అక్బర్బాషా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-12T23:02:34+05:30 IST