కాళేశ్వరం పంప్హౌస్ల మునకకు డిజైన్ లోపమే కారణం: విజయశాంతి
ABN, First Publish Date - 2022-08-10T05:17:29+05:30
కాళేశ్వరం పంప్హౌస్ల మునకకు డిజైన్ లోపమే కారణం: విజయశాంతి
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్హౌస్ల మునకకు డిజైన్ లోపమే కారణమని తేలిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కూడా మునకకు కారణమైనట్టు వెల్లడైందని ఆమె తెలిపారు. ప్రధానంగా పంప్హౌస్ల డిజైన్లోనే లోపం ఉందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని చెప్పారు. అయితే అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్హౌస్ల డిజైన్తో తమకు సంబంధం లేదని సీడీవో చెబుతుండటం గమనార్హం. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ యథాతథంగా..
''కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) పంప్హౌస్ల మునకకు డిజైన్ లోపమే కారణమని తేలింది. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కూడా మునకకు కారణమైనట్టు వెల్లడైంది. ప్రధానంగా పంప్హౌస్ల డిజైన్లోనే లోపం ఉందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇటీవలి భారీ వర్షాలతో వచ్చిన వరదలకు రక్షణగోడ కూలిపోయి ఈ పంప్హౌస్లు పూర్తిగా నీట మునిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పంప్హౌస్లకు డిజైన్ చేసిందెవరని ఆరా తీయగా... నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) పాత్ర లేదని తెలిసింది. ఈ పంప్హౌస్లను తాము డిజైన్ చేయలేదని సీడీవో స్పష్టం చేసింది. వాస్తవానికి నీటిపారుదల శాఖకు చెందిన ఏ పనులు చేపట్టాలన్నా సీడీవో డిజైన్లే కీలకం. ఎవరు డిజైన్ చేసినా దానిని పరిశీలించి ఆమోదం తెలపాల్సిన బాధ్యత కూడా సీడీవోదే. అయితే అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్హౌస్ల డిజైన్తో తమకు సంబంధం లేదని సీడీవో చెబుతుండటం గమనార్హం. పంపుల ఏర్పాటు సమయంలో కూడా నిపుణుడైన ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డిని అసలు సంప్రదించలేదని, డిజైన్లు కూడా ఆయనకు పంపలేదని తేలింది. పంపులు మునిగిన తర్వాత ఆయనను ముందుంచి ప్రకటనలు ఇప్పిస్తున్నారని స్పష్టమైంది. కాగా, పంపుల మునకకు బాధ్యత వహించాల్సింది నిర్మాణ సంస్థేనని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ప్రకటించారు. మునక నష్టం రూ.25 కోట్లకు మించి ఉండదని, దీనిని ఆ సంస్థే భరిస్తుందని ఆయన చెప్పారు. కానీ, పంపులను పరిశీలించకుండానే, అవి నీటిలో మునిగి ఉన్న సమయంలోనే ఈ ప్రకటన చేయడమేంటనే విమర్శలు వస్తున్నయి. పంపులు మునిగి దాదాపు నెలరోజులు కావస్తున్నా.. అన్నారం, మేడిగడ్డ వద్దకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గానీ, ఆ శాఖ ఈఎన్సీ (జనరల్) గానీ వెళ్లకపోవడాన్ని అందరూ తప్పుబడుతున్నరు. మరోవైపు నిర్మల్లోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు కూడా వరదల కారణంగా ఓ దశలో కొట్టుకుపోతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఈ ప్రాజెక్టును కూడా ఈ ఇద్దరు కీలక అధికారులు సందర్శించలేదు.'' అని విజయశాంతి అన్నారు.
Updated Date - 2022-08-10T05:17:29+05:30 IST