శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యే
ABN, First Publish Date - 2022-12-03T01:12:21+05:30
రేంజర్ శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యేనని, పోడు భూముల పంపిణీలో ప్రభుత్వ చేతకానితనం వల్లే చండ్రుగొండ రేంజ్ అధికారి హత్య జరిగిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు.
సర్కారు చేతకానితనం వల్లే ఘటన
ఎర్రబోడు ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలి
గొత్తికోయల బహిష్కరణ తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలి
ఎర్రబోడు సందర్శనలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్
చండ్రుగొండ, డిసెంబరు 2: రేంజర్ శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యేనని, పోడు భూముల పంపిణీలో ప్రభుత్వ చేతకానితనం వల్లే చండ్రుగొండ రేంజ్ అధికారి హత్య జరిగిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. ఇటీవల రేంజర్ హత్య జరిగిన చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారు ఎర్రబోడు గొత్తికోయ గ్రామంలో ఆయన శుక్రవారం పర్యటించారు. తొలుత హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన కొదండరామ్ ఎర్రబోడు చేరుకొని గ్రామ పెద్ద రవ్వా రమేష్ నుంచి హత్యకు దారితీసిన కారణాలు, పూర్వాపరాలను తెలుసుకుని ఆదివాసీలతో మాట్లాడారు. రేంజర్ హత్య అనంతర పరిణామాలతో భయాందోళనలో ఉన్న వలస ఆదివాసీలను ఆయన పరామర్శించారు. గొత్తికోయ అనే పదం అపరాధమైందని, గొత్తి పదానికి అర్థం లేదని, అలా పిలవటం, రాయడం సరికాదన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత వల్లే పచ్చని అడవుల్లో రక్తం చిమ్ముతోందని, పోడు సమస్యవల్ల గ్రామాల్లో అశాంతి నెలకొందన్నారు. ఏదేమైనా రేంజర్ హత్య బాధాకరమైన సంఘటన అని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని, రేంజర్ హత్వపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై గవర్నర్, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇరువర్గాల మధ్య ఘర్షణకు తావులేకుండా చట్టపరిధిలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వలస ఆదివాసీలను బహిష్కరిస్తూ బెండాలపాడు గ్రామసభ తీర్మానం చేయటం చట్టవిరుద్ధమైన చర్య అని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని గ్రామపెద్దలను కోరారు. ఆదివాసీలకు ఇళ్లు, అన్నివసతులు ఏర్పాటు చేయాలని, వారికి జీవనోపాధి కల్పించటంతో పాటు వారి సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలివ్వాలలన్నారు. కోదండరామ్ వెంట టీజేఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు మల్లెల రామనాథం, డోలి సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్, బైది రమేష్, నబీసాహెబ్, చాపలమడుగు వెంకటేశ్వర్లు, తదితరులున్నారు.
Updated Date - 2022-12-03T01:12:22+05:30 IST