‘రేషన్’ దూరం.. లబ్ధిదారులకు భారం
ABN, First Publish Date - 2022-10-30T23:33:20+05:30
పేదలకు రేషన్ బియ్యం అందించే చౌకదుకాణాలు అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు.
పనులు వదులుకుని షాపుల వద్ద పడిగాపులు
నెల నెలా తప్పని అవస్థలు
కొత్త పంచాయతీల్లో దుకాణాల ఏర్పాటుకు కలగని మోక్షం
జూలూరుపాడు, అక్టోబరు 30: పేదలకు రేషన్ బియ్యం అందించే చౌకదుకాణాలు అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని తండాలను పంచాయతీలుగా మార్చిన ప్రభుత్వం పంచాయతీ కేంద్రాల్లో చౌకదుకాణాలను ఏర్పాటు చేయడంలో అలక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో నిరుపేదలు బియ్యం కోసం రెండు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఒక్కొసారి రోజువారి పనులన్ని వదులుకుసి కేవలం రేషన్ బియ్యం కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. నెల నెల రేషన్ బియ్యం తెచ్చుకోవడం ఒక ప్రవాసనంగా మారింది. సంబంధఙత అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడం గమనార్హం.
దూరాభారంతో తప్పని తిప్పలు..
జూలూరుపాడు మండలంలోని పలు గ్రామాల తండాల్లోని ప్రజలు రేషన్ బియ్యం కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. చింతలతండా పంచాయతీలో గల లైన్తండా, చింతలతండా ప్రజలు ఐదు కిలోమీటర్ల దూరంలో గల కరివారిగూడెంలోని చౌకదుకాణానికి వెళ్లాల్సి వస్తోంది. ఇంత దూరం రేషన్ కోసం రావడం ప్రజలకు ఎంతో ప్రయాసతో కూడిన పనిగా మారింది. అదేవిధంగా సాయిరాంతండాకు చెందిన ప్రజలు రెండున్నర కిలోమీటర్లలో ఉన్న వెంగన్నపాలెం చౌకదుకాణానికి రావాల్సిన పరిస్థితి. శంభూనిగూడెం, మొద్దులగూడెం, గాంధీనగర్, రామకృష్ణాపుం, గంగారంతండా గ్రామాల ప్రజలు మూడు కిలోమీటర్లకు పైగా కాలినడకన అనంతారం చౌకదుకాణానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ గ్రామాల ప్రజలకు ఇది ఇబ్బందిగా మారింది. నల్లబండబోడు గ్రామంలోని నిరుపేదలు ఆరు కిలోమీటర్ల దూరాన గల గుండెపూడి వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అయా గ్రామాల ప్రజలు రేషన్ బియ్యం కోసం ఇంత దూరం వెళ్లడం వ్యయ ప్రయాసం కోర్చాల్సిన పరిస్థితి దాపురించింది.
ఈగోడు వినేదెవరు..?
రేషన్ కోసం మండలంలోని పలు గ్రామాల ప్రజలు పడుతున్న అవస్థల గురించి రెవెన్యూ, పౌర సరఫరాలశాఖాధికారులకు సర్పంచ్లు పలుసార్లు ఏ కరువు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడిలా పరిస్థితి తయారైంది. ప్రజల గోడును అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
పంచాయతీల్లో చౌక దుకాణాలు ఏర్పాటుచేయాలి: బి. రాములు, సర్పంచ్ చింతలండా
ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చినప్పటికి ఇప్పటి వరకు పంచాయతీ కేంద్రాల్లో దుకాణాలను ఏర్పాటు కార్య రూపం దాల్చకపోవడం శోచనీయం. చింతలతండాలో చౌకదుకాణాన్ని ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఇప్పటికే పలుసార్లు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేసిన ఫలితం లేదు. ఇప్పటికైన చౌకదుకాణాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
పనులు వదులుకుని దుకాణాలకు వస్తున్నాం: ధర్మసోత్ కళా శ్రీ, చింతలతండా
రేషన్ బియ్యం కోసం కొన్ని కిలోమీటర్లు వెళ్లాల్సి రావడంతో రోజువారి కూలీ పని సైతం వదులుకుని దుకాణం వద్దకు పరుగులు తీయాల్సి వస్తోంది. ప్రతి నెల ఈ విధంగా పనులు మానుకుని బియ్యం కోసం నాలుగైదు రోజులు దుకాణానికి వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా ఉంది.
చౌకదుకాణాలు అందుబాటులో ఉండాలి: బాణోత్ విజయ, చింతలతండా
లబ్ధిదారులకు అందుబాటులో చౌకదుకాణాలు ఉండాలి. కిలో మీటర్ల కొద్ది వెళ్లి బియ్యం తెచ్చుకోవడం భారంగా పరిణమిస్తోంది. ప్రజల అవస్థలను గమనించి అధికారులు తక్షణమే అందుబాటులో చౌకదుకాణాలను ఏర్పాటు చేయాలి.
ప్రతిపాదనలు పంపించాం: లూథర్ విల్సన్, తహసీల్దార్
రేషన్ దుకాణాలకు దూరంలో ఉన్న గ్రామాలను గుర్తించాం. కొత్త చౌకదుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పం పించాం. అనుమ తి రాగానే ఏర్పాటుచేస్తాం.
Updated Date - 2022-10-30T23:33:27+05:30 IST