కేసీఆర్ది దిక్కుమాలిన పాలన
ABN, First Publish Date - 2022-06-07T06:25:25+05:30
కేసీఆర్ది దిక్కుమాలిన పాలన
రైతుబంధు ఇచ్చి మిగిలిన పథకాలను బొందపెట్టిండు
‘ప్రజాప్రస్థానం’లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల
కొణిజర్ల, వైరా మండలాల్లో పాదయాత్ర
కొణిజర్ల / వైరా, జూన 6: కేసీఆర్ది దిక్కుమాలిన పరిపాలనని, ఆయన పాలనలో రైతులకు భరోసా లేకుండా పోయిందని, రైతుబంధు పేరుతో రూ.5వేలు ఇస్తే.. ఆ సొమ్ము రైతులు కాంటాల దగ్గర కాపలాకే సరిపోతాయని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె సోమవారం ఖమ్మం జిల్లా కొణిజర్ల, వైరా మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కొణిజర్ల మండలం పెద్దరామపురంలో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర లక్ష్మీపురం, మంగాపురం, మేకాలకుంట, తీగలబంజర, లాలాపురం, పల్లిపాడు మీదుగా వైరా మండలంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జరిగిన సభల్లో షర్మిల ప్రసంగిస్తూ పంటనష్టం జరిగితే రైతులను ఆదుకోవడం కాదు కదా.. కనీసం ఉన్న పంటకు మద్దతు ధర కూడ ఇవ్వలేకపోతున్నాడని, వరి వేస్తే ఉరే అని చెప్పి అసమర్థ, దరిద్రమైన సీఎం అని తీవ్రంగా మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, డబుల్బెడ్రూం ఇళ్లు, పోడుభూములకు పట్టాలు, రైతులకు రుణమాఫీ, కేజీ టు పీజీ విద్య.. ఇలా అన్ని రకాలుగా కేసీఆర్ మాయమాటలతో మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల పాలనలో ఏ వర్గాన్ని కూడా ఆదుకోలేకపోయిన కేసీఆర్ పాలన మాటలకే పరిమితమని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొత్తకొత్త వాగ్దానాలు చేస్తాడని, ప్రజలు దీన్ని గుర్తించాలన్నారు. ఈ క్రమంలో లాలాపురం వద్ద షర్మిలను కలిసిన కొందరు రైతులు తుమ్మలచెరువు ఆక్రమణ, అందులో అధికార పార్టీ నాయకుడి ప్రమేయం గురించి వివరించారు. అందుకు స్పందించిన షర్మిల అధికారపార్టీ అండదండలతో చెరువులను కబ్జా చేయడమేంటని, యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైరాలో జరిగిన సభలో షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో బాలికలు, మహిళల మానప్రాణాలు కాపాడలేని సీఎం కేసీఆర్ ఉరివేసుకొని చచ్చిపోవాలని, ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని తనను ప్రశ్నిస్తున్న కేటీఆర్ ఒక్కరోజు తనతో కలిసి పాదయాత్ర చేయాలని, తనతో పాదయాత్రకు వస్తే కేటీఆర్కు వాటిని చూపిస్తానన్నారు. ఒకవేళ సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతాననన్నారు. ప్రజాసమస్యలు ఎత్తిచూపడంలో బీజేపీ, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యాయని వాటిపై ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని స్పష్టం చేశారు.
వైరా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు
వైరా సభలో.. ప్రస్తుత ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే బాణోతు మదనలాల్పై షర్మిల విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ఇతర పార్టీల్లో గెలిచిన వారిని సంతలో పశువులు మాదిరిగా కొనుగోలు చేసి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ ఫొటోతో ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ చంకనెక్కిన వారికి ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ ఫొటోతో గెలిచిన మదనలాల్ కేసీఆర్ వెంట వెళ్లటంతో గత ఎన్నికల్లో ఆయన్ను ఓడించారని, అలాగే 2018 ఎన్నికల్లో వైఎస్సార్ ఫొటోతో గెలిచిన రాములునాయక్కు కూడా వచ్చే ఎన్నికల్లో అదే గతి పడుతుందన్నారు. బెల్టుషాపుల నిర్వహణ, భూకబ్జాల్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎమ్మెల్యే రాములు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. వైరా రిజర్వాయర్ ఆధునికీకరణకు వైఎస్సార్ రూ.50కోట్లు ఖర్చుచేశారని, 12మండలాలకు సాగునీరందించారని, వైఎస్సార్ మినహా వైరా రిజర్వాయర్ అభివృద్ధికి ఏఒక్కరూ కృషిచేయలేదని విమర్శించారు.
నేడు భట్టి స్వగ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష
సోమవారం రాత్రి వైరా మండలం గండుగులపాడులో బస చేసిన షర్మిల మంగళవారం ఉదయం 10.30 గంటలకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొని అక్కడే రాత్రి బస చేస్తారు.
Updated Date - 2022-06-07T06:25:25+05:30 IST