కేజీబీవీలో మౌలిక వసతుల కల్పనకు కృషి
ABN, First Publish Date - 2022-09-09T05:14:57+05:30
జిల్లాలోని కస్తూర్భాగాంధీ పాఠశాలపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేకత శ్రద్ధ కనబరుస్తున్నారని పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేశారని డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు.
పాఠశాలకు రూ.50వేల నిధుల మంజూరు
డీఈవో సోమశేఖరశర్మ
జూలూరుపాడు, సెప్టెంబరు 8: జిల్లాలోని కస్తూర్భాగాంధీ పాఠశాలపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేకత శ్రద్ధ కనబరుస్తున్నారని పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేశారని డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు. గురువారం ఆయన జూలూరుపాడులోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మీకంగా సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. తరగతి గదులను సందర్శించి బాలికల ప్రతిభను పరిశీలించారు. భోజనం, కూరగాయలను పరిశీలించారు. కాంట్రాక్టర్ అందించే కూరగాయలు నాసిరకంగా ఉంటున్నాయని పాఠశాల ప్రత్యేక అధికారి పద్మజ డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన కాంట్రాక్టర్కు ఫోన్ చేసి నాణ్యమైన కూరగాయలను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు ఒక్కొక్క పాఠశాలకు కలెక్టర్ రూ. 50వేల చొప్పున నిధులు కేటాయించారని తెలిపారు. రెండు మూడు రోజుల్లో తొలివిడతగా ఒక్కొక్క పాఠశాలకు రూ. 30వేల చొప్పున అందిస్తామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేజీబీవీ పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుసుకున్నామని నివేదికను అధికారులకు అందచేయనున్నట్లు తెలిపారు. కస్తూర్భా పాఠశాలలోని బాలికలకు నాణ్యమైన విద్యతోపాటు భోజనం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కేజీవీబీలు సురక్షితమైన విద్యాలయాని పేర్కొన్నారు. జూలూరుపాడులోని కేజీబీవీ పాఠశాల మంచిగా ఉందని, ఎంఇవో, పాఠశాల ప్రత్యేక అధికారిని ఆయన అభినందించారు. మున్ముందు కూడా పాఠశాలలో ఇలాంటి వాతవారణాన్ని కొనసాగించాలని కోరారు. విద్యార్థినీల ప్రతిభను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గుగులోత్ వెంకట్, పాఠశాల ప్రత్యేక అధికారి పద్మజ, ఉపాధ్యాయ స్బిబంది పాల్గొన్నారు.
Updated Date - 2022-09-09T05:14:57+05:30 IST