ఎండుతున్న మొక్కజొన్న
ABN, First Publish Date - 2022-03-11T04:52:17+05:30
ఎన్నో ఆశలతో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నీటి ఎద్దడితో పరేషాన్ అవుతున్నారు.
చివరి భూములకు అందని నీరు
నాలుగు రోజులుగా మేజర్ కాలువలకే పరిమితం
పూర్తిగా నీటి సరఫరా బంద్ కావడంతో ఆందోళనలో రైతులు
బోనకల్, మార్చి 10: ఎన్నో ఆశలతో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నీటి ఎద్దడితో పరేషాన్ అవుతున్నారు. బీబీసీ కాల్వలకు నీటి విడుదల సాఫీగా జరుగుతుందని బావించి మండల పరిదిలో 24వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఆళ్లపాడు, కలకోట, పొలంపల్లి మైనర్ల కింద పంటలు వేసిన రైతులు నీటి తడులు సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రదానంగా ఆళ్లపాడు, కలకోట మైనర్ల పరిధిలో చివర భూములకు నీరు అందడం లేదు. బీబీసీకి 800 క్యూసెక్కులకు పైగా నీటి విడుదల జరిపితేనే చివర భూములకు నీరు అందుతుంది. వారబందీ విధానంతో పాటు తక్కువ క్యూసెక్కుల నీటి విడుదల వలన ఎగువ ప్రాంతంలో సాగు భూములకు మాత్రమే నీరంది దిగువకు నీళ్లు రావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. మూడు రోజుల నుంచి వస్తున్న నీరు సన్న దారలాగ రావడంతో మైనర్ల చివర భూములకు నీరు ఎక్కడం లేదు. గురువారం నుంచి పూర్తిగా నీటి సరఫరా బంద్ కావడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విధి లేని పరిస్థితుల్లో ఆం దోళనకు దిగేందుకు రైతులు సిద్దమవుతున్నారు. ప్రస్తు తం పంట కంకి దశలో ఉండటంతో నీటి తడులు తప్పనిసరి. కాని వారబందీతో పాటు నీటి సరఫరా తక్కువగా వస్తుండటంతో మొక్కజొన్న పైరు ఎండిపోతుంది. ఎండుతున్న పంటలను కాపాడుకునే పరిస్థితి లేక నిరాశా, నిస్పృహలతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
పది ఎకరాల్లో పంట ఎండిపోతోంది: పారా నారాయణ, రైతు, ఆళ్లపాడు
ఆళ్లపాడు మైనర్ పరిధిలో పది ఎకరాల మొక్కజొన్న పంట ఎండిపోతుంది. ప్రస్తుతం పంట కంకి దశలో ఉన్నందున నీటి తడుల అవసరం ఉంది. వారం రోజులుగా కాలువ చుట్టు తిరుగుతున్నా నీళ్లు కాలువకు సరిపడ రావడం లేదు. రాత్రివేళల్లో తిరుగుతున్నా నీటి జాడ కనిపించడం లేదు. పది రోజుల పాటు నీటి సరఫరా ఎక్కువ క్యూసెక్కులతో సరఫరా చేస్తేనే పంట దక్కుతుంది.
అరకొర నీటితో గొడవలు జరుగుతున్నాయి: వీరంకి తిరపతి, రైతు, ఆళ్లపాడు
సరిపడ కాల్వలకు నీరు రాక వచ్చిన కొద్దిపాటి నీటి వలన ఎక్కువగా రైతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఆళ్లపాడు మైనర్ పరిధిలో 5 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. రాత్రిభవంళ్లు కాల్వల చుట్టు తిరుగుతున్నాను. ఫలితం కనిపించడం లేదు. పంటను ఎలా కాపాడుకోవాలో అర్ధం కావడం లేదు.
నిరంతరంగా నీటి సరఫరా చేయాలి: మర్రి తిరుపతిరావు, సర్పంచ్ ఆళ్లపాడు
నిరంతరంగా నీటి సరఫరా జరపాలి. వారబందీ విధానంలో లోపాలు ఉన్నాయి. కచ్చితమైన ప్రణాళికతో నీటి విడుదల జరగడం లేదు. ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు బంద్ అవుతాయో అర్దం కాని పరిస్థితి. నిరవదిక నీటి విడుదల చేసి పంటలను కాపాడాలి.
Updated Date - 2022-03-11T04:52:17+05:30 IST