KCR School Dubbaka: సిద్ధమైన మూడేళ్లకు..
ABN, First Publish Date - 2022-12-20T03:31:57+05:30
కార్పొరేట్ హంగులతో కళ్లు చెదిరేలా దుబ్బాకలో నిర్మితమైన ‘కేసీఆర్ బడి’ ఎట్టకేలకు తెరుచుకుంది. మూడేళ్ల క్రితమే భవన నిర్మాణం పూర్తయినా సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం కోసం చూసీచూసీ చివరికి సాదాసీదాగా ప్రారంభమైంది.
దుబ్బాకలో ఎట్టకేలకు తెరుచుకున్న ‘కేసీఆర్ బడి’
హంగూ ఆర్భాటం లేకుండా కొత్త భవనంలోకి పిల్లలు
10.5 కోట్లతో 2019లో నిర్మాణం పూర్తి
సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి ఎదురుచూపులు
వీలు చూసుకొని వస్తా.. పిల్లల్ని భవనంలోకి పంపండి
మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
దుబ్బాక, డిసెంబరు 19: కార్పొరేట్ హంగులతో కళ్లు చెదిరేలా దుబ్బాకలో నిర్మితమైన ‘కేసీఆర్ బడి’ ఎట్టకేలకు తెరుచుకుంది. మూడేళ్ల క్రితమే భవన నిర్మాణం పూర్తయినా సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం కోసం చూసీచూసీ చివరికి సాదాసీదాగా ప్రారంభమైంది. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకండానే విద్యార్థులు సోమవారం కొత్త భవనంలోకి అడుగుపెట్టారు. ప్రార్థన నిర్వహించి తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు విన్నారు. తాను వీలు చూసుకొని కొత్త పాఠశాలను సందర్శిస్తానని, పిల్లలను సాదాసీదాగానే భవనంలోకి తరలించి, తరగతులను కొనసాగించాలని కేసీఆర్ మౌఖిక ఆదేశాలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక పాఠశాలలో కేసీఆర్ తొమ్మిదో తరగతి దాకా చదివారు.
తాను చదువుకున్న బడి శిథిలావస్థకు చేరడంతో దాన్చి కూల్చి అదేచోట 18,787చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని వసతులతో కూడిన కొత్తగా భవనాన్ని నిర్మించాలని సీఎం సంకల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా రూ.10.5 కోట్లు కేటాయించా రు. 2017లో నిర్మాణ పనులు మొదలై 2019లో ముగిశాయి. ఉన్నత పాఠశాల నుంచి జూనియర్, డిగ్రీ కాలేజీ దాకా పిల్ల లు ఓకేచోట చదివేలా 28 తరగతి గదులు.. మూడు సిబ్బంది గదులు.. నాలుగు ల్యాబ్లు, స్పోర్ట్ గది, ప్రిన్సిపల్ గది, ల్రైబరీ, కంప్యూటర్ ల్యాబ్, సమావేశ మందిరంతో కూడిన మూడంతస్థుల భవనాన్ని కార్పొరేట్ హంగులతో నిర్మించారు. 250 మంది పిల్లలు ఒకేసారి వినియోగించేలా మరుగుదొడ్లను నిర్మించారు. తాగునీటి కోసం రెండు వాటర్ ట్యాంకులు నిర్మించారు. భవనం కోసం ఓ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. అయితే మూడేళ్లక్రితమే నిర్మాణం పూర్తయినా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. అప్పట్లో దుబ్బాక సిటింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం తర్వాత రాజకీయ పరిణామాలతోనే ప్రారంభోత్సవం నిలిచిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
వీలు చూసుకుని వస్తా : కేసీఆర్
దుబ్బాక రెవెన్యూ డివిజన్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వారం క్రితం సీఎంను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగానే తాను చదువుకున్న పాఠశాలను వీలు చేసుకుని సందర్శిస్తానని, విద్యార్థులను తరలించి, తరగతులను కొనసాగించాలని ప్రభాకర్రెడ్డికి సీఎం సూచించారు. జూనియర్, డిగ్రీ కళాశాలలను అదే భవనంలోకి చేర్చాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఉన్నత పాఠశాలను, జూనియర్ కాలేజీని కొత్త భవనంలోకి తరలించారు.
Updated Date - 2022-12-20T03:32:06+05:30 IST