జైలులో బండి సంజయ్ను పరామర్శించిన కిషన్ రెడ్డి
ABN, First Publish Date - 2022-01-04T18:37:22+05:30
బండి సంజయ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జైల్లో ములకత్ ద్వారా పరామర్శించారు.
కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జైల్లో ములకత్ ద్వారా పరామర్శించారు. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, వివేక్, స్థానిక నేతలు పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు పోలీసులపై కార్యకర్తలతో దాడి చేయించారనే ఆరోపణలతో నమోదైన కేసుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317ను సవరించాలంటూ కరీంనగర్లో జాగరణ దీక్షకు పూనుకున్న సంజయ్ని పోలీసులు ఆదివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు మరో 16 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు.. వారిపై కేసు నమోదు చేశారు.
Updated Date - 2022-01-04T18:37:22+05:30 IST