అధికారుల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి
ABN, First Publish Date - 2022-05-21T06:32:58+05:30
సెస్ అధికారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కరెంట్ తీగలు తెగి గడ్డివాముపై పడి భారీ మంటలు చెలరేగడంతో ఆర్పేందుకు వెళ్లిన బానోతు నీల (35), ఆమె మరిది బానోతు రవి (30) తీగలు తగిలి విద్యు దాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందారు.
- విద్యుదాఘాతంతో వదిన, మరిది మృతి
- మృతదేహాలతో గ్రామస్థుల ఆందోళన
వీర్నపల్లి, మే 20: సెస్ అధికారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కరెంట్ తీగలు తెగి గడ్డివాముపై పడి భారీ మంటలు చెలరేగడంతో ఆర్పేందుకు వెళ్లిన బానోతు నీల (35), ఆమె మరిది బానోతు రవి (30) తీగలు తగిలి విద్యు దాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందారు. వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న సంఘటనతో స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. గ్రామస్థులు, బంధువుల వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ తండాకు చెందిన బానోతు రాజు, అతడి సోదరుడు బానోతు రవి నివాసాలకు కొద్ది దూరంలో విద్యుత్ లైన్ ఉంది. తీగలు వదులుగా ఉండడంతో తరచూ నిప్పు రవ్వలు వచ్చేవి. ఎప్పటిలాగే గురువారం రాత్రి విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తగిలి తెగిపడ్డాయి. గడ్డివా ముపై తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి. సమీపం లోని పశువుల పాకలో ఆవు ఉండడంతో గమనంచిన బానోతు నీల, బానోతు రవి మంటలను ఆర్పేందుకు వెళ్లారు. మూగ జీవిని కాపాడి నీటితో మంటలు ఆర్పే ప్రయత్నంలో తెగిపడిన తీగలు తగిలి అక్కడిక్కడే మృతి చెందారు. సంఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామ స్థులు, బంధువులు శుక్రవారం ఉదయం వీర్నపల్లి సబ్స్టేషన్ ఎదుట మృతదేహాలతో ఆందోళన నిర్వహిం చారు. సెస్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం చోటు చేసుకుందని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 3 గంటలపాటు సబ్స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. న్యాయం జరిగే వరకు కదలబోమని భీష్మించారు. ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతు పలికారు. సీఐ మొగిలి, ఎస్సై రవికుమార్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా గిరిజనులు వినిపించుకోలేదు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చినా శాంతించలేదు. అనంతరం అక్కడికి చేరుకున్న సెస్ అధికారులు, మండల పరిషత్ అధికారులతో చర్చలు జరిపారు. సెస్ నుంచి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు, ప్రభుత్వ నుంచి ఒక్కో కుటుంబానికి 2 ఎకరాల భూమి, నీల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, మండల పరిషత్ నుంచి రవి కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా, తక్షణ సహాయం కింద రూ.10 వేలు, అతడి భార్యకు గ్రామ పంచాయతీలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలిచినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డబోయిన గోపీ తదితరులు సంఘీభావం తెలిపారు.
Updated Date - 2022-05-21T06:32:58+05:30 IST