పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN, First Publish Date - 2022-05-18T05:20:12+05:30
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు.
- కలెక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి కల్చరల్, మే 17: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో స్కూల్ డైరెక్టర్ శ్రీదేవసేనతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష నిర్వహణ సమయంలో ప్రశ్నాపత్రం లీక్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఆదేశించారన్నారు. జిల్లాలో 8,160 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు 49 కేంద్రాలను ఏర్పాట్లు చేశామన్నారు. 17 కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మే 19 నాటికి మిగిలిన పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాల ప్రహరీ గోడలను వేరిఫై చేసి అవసరమైన చోట అదనపు కెమెరాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, పారిశుధ్య బాధ్యతల నిర్వహణ స్థానిక సంస్థలు మున్సిపాలిటీలు నిర్వహిస్తాయన్నారు. సకాలంలో విద్యార్థులు హాజరయ్యేందుకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీఈవో మాదవి, పెద్దపల్లి ఏసీపీ ఎస్ఎస్ ఫణీ, పంచాయతీరాజ్ ఈఈ మునిరాజ్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్కుమార్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-18T05:20:12+05:30 IST